ఆన్లైన్ చదువు కోసం పిల్లాడికి ఫోనిస్తే... తండ్రికి ప్రాణం పోయినంతపనయ్యింది!
ABN , First Publish Date - 2020-09-27T13:36:07+05:30 IST
యూపీలోని ఆగ్రాకు చెందిన ట్రాన్స్పోర్ట్ విభాగపు అధికారి కుమారుడు ఆరు నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ 2.50 లక్షలు పోగొట్టాడు. సదరు అధికారి తన బ్యాంకు ఖాతా చెక్ చేసుకున్నప్పుడు ఈ విషయం వెల్లడయ్యింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై...
ఆగ్రా: యూపీలోని ఆగ్రాకు చెందిన ట్రాన్స్పోర్ట్ విభాగపు అధికారి కుమారుడు ఆరు నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ 2.50 లక్షలు పోగొట్టాడు. సదరు అధికారి తన బ్యాంకు ఖాతా చెక్ చేసుకున్నప్పుడు ఈ విషయం వెల్లడయ్యింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని సికందరా నివాసి, ట్రాన్స్పోర్టు అధికారి సైబర్ సెల్కు ఫిర్యాదు చేస్తూ, తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతాలోని రూ. 2.50 లక్షలు మాయమయ్యాయని పేర్కొన్నారు. ఆ ఖాతా నుంచి చాలా తక్కువగా లావాదేవీలు నిర్వహిస్తానని, ఇటీవల చెక్ చేసుకోగా రూ. 500 మిగిలాయని తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆ ఖాతా నుంచి పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని తేలింది. మార్చి, ఆగస్టు నెలల మధ్య ఈ లావాదేవీలు జరిగినట్టు తేలింది. సదరు అధికారి ఆన్లైన్ చదువు కోసం కుమారునికి ఫోన్ ఇవ్వగా, ఆ బాలుడు ఆన్లైన్ గేమ్స్ ఆడాడు. ఈ నేపధ్యంలో ఆ బాలుడు రివార్డ్ పాయింట్ల లాంటివాటి కోసం ఆయా గేమ్స్ కంపెనీలకు డబ్బులు చెల్లించాడు. ఈ విషయం వెల్లడి కావడంతో సదరు అధికారి తన ఫిర్యాదు వాపసు తీసుకుని, కుమారుడిని మందలించారు.