బ్యాన్ పీరియడ్లో బదిలీలు
ABN , First Publish Date - 2022-01-18T05:41:04+05:30 IST
జిల్లాలో 50మంది వీఆర్వోలు మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.వీరంతా బ్యాన్ పీరియడ్లో బదిలీ అయ్యారని, అందుకు ప్రభుత్వ జీవో లేదంటూ, 2020 నవంబరు నాటి మెమోను చూపిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ కొర్రీ వేసింది.
బిల్లులకు ఖజానా శాఖ కొర్రీ
జీతాలు అందక వీఆర్వోల అవస్థలు
మదనపల్లె, జనవరి 17: జిల్లాలో 50మంది వీఆర్వోలు మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అసలే అరకొర జీతం... ఆపై అప్పులు... ఆ వచ్చే వేతనం కూడా సకాలంలో అందకపోవడంతో వీరంతా అవస్థలు పడుతున్నారు. వీరంతా బ్యాన్ పీరియడ్లో బదిలీ అయ్యారని, అందుకు ప్రభుత్వ జీవో లేదంటూ, 2020 నవంబరు నాటి మెమోను చూపిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ కొర్రీ వేసింది. దీంతో తామంతా పస్తులుండాల్సి వస్తోందంటూ అటు తహసీల్దార్లకు, ఇటు డీఆర్వోకు మొరపెట్టుకుంటున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు, పలమేరు, కుప్పం నియోజకవర్గాల్లో గత ఏడాది అక్టోబరు, నవంబరుల్లో వీఆర్వోలను బదిలీ చేశారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు లేకపోయినా సచివాలయాల క్లస్టర్ల విభజన, పరిపాలన సౌలభ్యం పేరుతో 50 మందికిపైగా గ్రామ రెవెన్యూ అధికారులను రాజకీయ బదిలీలు చేపట్టారు. అయితే ఆయా తహసీల్దార్ కార్యాలయాల నుంచి వెళ్లిన జీతం బిల్లులను ఖజానా శాఖ అధికారులు ఆపేశారు. ఈ విషయాన్ని వీఆర్వోలు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... ప్రయోజనం లేకపోయింది. ఇలా మూడునెలలైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా వీఆర్వోల అసోసియేషన్ డీఆర్వో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. వేతనాలు సకాలంలో అందేలా ట్రెజరీకి సూచనలు చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.