జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు స్థానచలనం

ABN , First Publish Date - 2021-07-25T05:48:20+05:30 IST

జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు బదిలీ అయ్యింది.

జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు స్థానచలనం

భారీగా మార్పులు



విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు బదిలీ అయ్యింది. ఈ మేరకు శనివారం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.శివశంకరరెడ్డిని నగరంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించి, అక్కడ పనిచేసే సీహెచ్‌ శ్రీనివాసబాబాను రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. నగరంలో రెండో అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.శ్రీసీతను గుంటూరు జిల్లా తెనాలి రెండవ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. తెనాలిలో రెండో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వై.ప్రేమలతను గాజువాక జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించి, అక్కడ పనిచేస్తున్న ఎం.శివపార్వతిని అనంతపురం జిల్లా ధర్మవరం బదిలీ చేశారు. ధర్మవరంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.శ్రీనివాసరావును విశాఖపట్నం మూడో అడిషనల్‌ సివిల్‌ జడ్జిగా నియమించి, అక్కడ పనిచేస్తున్న లతా కోలార్‌ను కడప జిల్లా నందలూరు బదిలీ చేశారు. అలాగే కర్నూలు జిల్లా బనగానపల్లె జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రాకేష్‌ను విశాఖపట్నం ఏడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌గా నియమించి, ఇక్కడ వున్న ఎల్‌.జగదీష్‌కుమార్‌ను గుంటూరు జిల్లా రేపల్లె జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. రేపల్లెలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎం.ప్రదీప్‌ను అనకాపల్లి మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. అదేవిధంగా నూజివీడు ఒకటో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సుబ్బారావును ఖాళీగా వున్న అరకులోయ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌గా నియమించారు. భీమిలిలో ఒకటవ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ప్రమీలారాణిని ఏలూరులోని జువెనైల్‌ కోర్టు రెండో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఒకటో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.మాధురిని నగరంలో ఖాళీగా వున్న ఆరవ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. బదీలీ అయిన వారంతా ఈనెల 26వ తేదీలోగా బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు రిజిస్ర్టార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-25T05:48:20+05:30 IST