చర్చనీయాంశంగా ఆసిఫాబాద్ డీఎఫ్వో బదిలీ
ABN , First Publish Date - 2022-07-05T04:30:11+05:30 IST
జిల్లా అటవీశాఖాధికారి శాంతారాం బదిలీ వ్యవహారం చర్చనీ యాంశంగా మారింది. పోడు భూముల వ్యవహారం తేలేంత వరకు రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లవద్దని ఉన్నతా ధికారులు ఆదేశించినా జిల్లా అధికారులు బేఖాతరు చేశారు. దీనిపై జిల్లాకు చెందిన సిర్పూరు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు సదరు అఽధికారి తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు.
- పోడు భూముల వివాదమే కారణమని ఊహాగానాలు
- ప్రభుత్వానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు
- పీసీసీఎఫ్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
- దీర్ఘకాలిక సెలవుపై డీఎఫ్వో
- పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు
(ఆంధ్రజ్యోతి ఆసిఫాబాద్)
జిల్లా అటవీశాఖాధికారి శాంతారాం బదిలీ వ్యవహారం చర్చనీ యాంశంగా మారింది. పోడు భూముల వ్యవహారం తేలేంత వరకు రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లవద్దని ఉన్నతా ధికారులు ఆదేశించినా జిల్లా అధికారులు బేఖాతరు చేశారు. దీనిపై జిల్లాకు చెందిన సిర్పూరు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు సదరు అఽధికారి తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అటవీ అధికారి శాంతారాంపై బదిలీవేటు పడినట్టు తెలుస్తోంది. ఈపరిస్థితిని ముందే ఊహించిన శాంతారాం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.
(ఆంధ్రజ్యోతి ఆసిఫాబాద్)
ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పోడు భూముల వ్యవహారం మరోసారి తెరపైకి రావటంతో రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వివాదాలు, ఘర్షణలు తిరిగి రాజుకుం టున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ను కలుగజేసుకోవాలని ప్రభుత్వం కోరగా కొండపల్లి, బెజ్జూరు, ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి వివా దాలను పరిష్కరించే క్రమంలో అటవీఅధికారులు స్థానికప్రజా ప్రతిని ధులు, రైతులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అటవీశాఖ భూములకు సంబంధించి అక్రమంగా సాగు చేస్తున్నారన్న కారణంగానే ఆభూముల స్వాధీనానికి ప్రయత్నించామని అటవీ అధికారులు చెప్పుకొచ్చారు. అటవీ రికార్డుల ఆధారంగానే తాము చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులకు తేల్చిచెప్పిన నేపథ్యంలోనే రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారికి డీఎఫ్వో వ్యవహారశైలిపై ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు. మరోవైపు ఇంటిలిజెన్స్ కూడా జిల్లా అధికారుల సయోధ్య యత్నాలు, పోడురైతుల నిరసనలకు సంబంధించి నివేదికలను పంపించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గతనెల28న హఠాత్తుగా ఆయనను పీసీసీఎఫ్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈపరిస్థితిని ముందేగ్రహించిన డీఎఫ్వో ముందు గానే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు అనుమతి కోరినట్టు అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో ఇద్దరు శాసనసభ్యులు చక్రం తిప్పారన్నవార్తలు ప్రస్తుతంసర్వత్రా చర్చ నీయాంశంగా మారింది.
పంతం నెగ్గించుకున్న నేతలు
జిల్లాలో ఐదు సంవత్సరాలుగా పోడు భూముల వివాదం తరుచూ శాంతి భద్రతలు సృష్టిస్తున్న విషయం పాఠకులకు విధితమే. అయితే గతంలో కుదిరిన ఒప్పందం మేరకు ప్రస్తుతం రైతులు సాగు చేసు కుంటున్న భూముల్లో యధాతథంగా పంటలు సాగు చేసుకోవచ్చని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గతంలో రైతుకు హామీ ఇచ్చారు. అయితే ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభం కాగానే రైతులు పంటలు వేసుకునేందుకు ప్రారంభించగా అటవీశాఖ అధికారులు ఆ భూములు తమవిగా క్లయిం చేస్తూ అందులో పంటలు వేయవద్దని అడ్డుకున్నారు. ఇలా కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట మండ లం కొండపల్లి, దరోగపల్లి, లోడ్పల్లి, బెజ్జూరు మండలంలో ఎల్కపల్లి, సిద్ధాపూర్, పాపన్పేట, సిర్పూరు(టి) మండలంలో ఇటికల్పహాడ్, కాగజ్నగర్ మండలం సార్సాల, కొత్తసార్సాల, కడంబా, ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి తదితర గ్రామాల్లో రైతులకు, అటవీ అధికారులకు మధ్య వివాదాలు తలెత్తాయి. అయితే ఈ వివాదాలు అన్నీ కూడా రెవెన్యూ, అటవీ శాఖ మధ్య ముడిపడి ఉన్న వివాదాలే కావడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 75వేల ఎకరాల్లో రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాలు ఉన్న గ్రామాల్లోనే తరుచూ అటవీశాఖకు రైతులకు మధ్య ఘర్షణలు జరు గుతున్నాయి. సర్వే పూర్తయ్యేంత వరకు సరిహద్దులు గుర్తించేంత వరకు రైతులను పంటలు సాగు చేసుకోనివ్వాలని జిల్లా ఎమ్మెల్యేలు అటవీశాఖకు విజ్ఙప్తి చేస్తున్నా ఆశాఖ సిబ్బంది ఈ విజ్ఙప్తులను తోసిరాజని రైతులతో తరుచూ గిల్లికజ్జాలకు దిగుతున్నారన్నది ఎమ్మెల్యేల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అటవీఅధికారిపై వేటు పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జిగా ఆసిఫాబాద్ డివిజనల్ అటవీ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.