ఆర్బీకే నుంచి లావాదేవీలు జరగాలి
ABN , First Publish Date - 2021-10-23T04:50:00+05:30 IST
జిల్లాలో ఉన్న ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి పాడిరైతులకు కావాల్సిన సదుపాయాలపై లావాదేవీలు తప్పనిసరిగా జరగాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డి. మహేశ్వరుడు అన్నారు
పశుసంవర్ధక శాఖ జేడీ మహేశఽ్వరుడు
మనుబోలు, అక్టోబరు 22: జిల్లాలో ఉన్న ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి పాడిరైతులకు కావాల్సిన సదుపాయాలపై లావాదేవీలు తప్పనిసరిగా జరగాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డి. మహేశ్వరుడు అన్నారు. స్థానిక పశువైద్యశాలలో శుక్రవారం మనుబోలు, వెంకటాచలం మండలాల ఏహెచ్ఏల శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 353 మంది ఏహెచ్ఏల నియామకం జరిగిందన్నారు. వారికి నాలుగు నెలల పాటు పశువైద్యంపై శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాకు వచ్చిన 2వేల మెట్రిక్ టన్నుల టీఎంఆర్ దాణా, 90వేల మెట్రిక్టన్నుల పశుగ్రాస విత్తనాలను పాడిరైతులకు అందజేశామన్నారు. ప్రభుత్వం పాడిరైతులకు అందిస్తున్న పథకాలు, సబ్సిడీల గురించి రైతుభరోసా కేంద్రాల ద్వారా తెలపాలన్నారు. గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయిస్తున్నామన్నారు. పశు నష్టపరిహారం కింద రూ. 8.5కోట్ల బిల్లులు ప్రభుత్వానికి పంపామనీ, ఆమోదం కాగానే రైతుల ఖాతాలకే నేరుగా జమచేస్తామనీ తెలిపారు. ప్రతి ఆర్బికేలో పాడిరైతులకు సంబంధించి పశుసంవర్థకశాఖ కింద 12 రకాల సదుపాయాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య, నెల్లూరు డీడీ సురేష్కుమార్, మనుబోలు ఏడీ గురవారెడ్డి, వైద్యులు రాధిక, హర్షకుమార్, సరిత, మంజునాఽథ్ సింగ్, ప్రభాకర్ పాల్గొన్నారు.