క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై త్వరలో నిషేధం?

ABN , First Publish Date - 2021-11-17T18:17:16+05:30 IST

క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, చెల్లింపులపై త్వరలో ప్రభుత్వం

క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై త్వరలో నిషేధం?

ముంబై : క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, చెల్లింపులపై త్వరలో ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే బంగారం, షేర్లు లేదా బాండ్ల రూపంలో సంపదగా నిల్వ చేసుకోవడానికి అనుమతించవచ్చు. క్రిప్టో కంపెనీలు, ఎక్స్ఛేంజిలను పూర్తిగా నిలిపేయవచ్చు. కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే వేదికలుగా ఇవి పని చేయకుండా నిరోధించవచ్చు. దీనికి సంబంధించిన బిల్లు తుది దశలో ఉంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది. 


జాతీయ మీడియా బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై పూర్తిగా నిషేధం విధించకుండా, వాటి రూపంలో చెల్లింపులు, లావాదేవీలను నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం, షేర్లు లేదా బాండ్ల రూపంలో ఆస్తిగా ఉంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఇదిలావుండగా క్రిప్టో కమ్యూనిటీ ఇప్పటికే దీనిని కరెన్సీగా కాకుండా ఆస్తిగానే పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరింది. దీనికి అనుమతులు లభించడానికి, నిషేధం నుంచి తప్పించుకోవడానికి ఈ విజ్ఞప్తి చేసింది. క్రిప్టోకరెన్సీల భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత వారం ఓ సమావేశం జరిగింది. ముందస్తు చర్యలను తీసుకోవాలనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైందని తెలుస్తోంది. నియంత్రణ లేని క్రిప్టో మార్కెట్లు మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ అడ్డాలుగా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-11-17T18:17:16+05:30 IST