15 నుంచే రైళ్లు?

ABN , First Publish Date - 2020-04-10T07:31:02+05:30 IST

ట్టకేలకు రైలు ప్రయాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది!. లాక్‌డౌన్‌ ఈనెల 14 తర్వాత కూడా కొనసాగుతుందా... లేదా అన్నదానిపై కేంద్రం స్పష్టం చేయనప్పటికీ...

15 నుంచే రైళ్లు?

  • స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు మాత్రమే 
  • రైలెక్కాలంటే 4గంటల ముందే స్టేషన్‌కు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9: ఎట్టకేలకు రైలు ప్రయాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది!. లాక్‌డౌన్‌ ఈనెల 14 తర్వాత కూడా కొనసాగుతుందా... లేదా అన్నదానిపై కేంద్రం స్పష్టం చేయనప్పటికీ.. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైళ్ల పునరుద్ధరణకు రైల్వేబోర్డు సమాయత్తమవుతోంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి 15నుంచి రైళ్లను నడిపేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. రెగ్యులర్‌ రైళ్లుగా కాకుండా కేవలం ప్రత్యేక సర్వీసుల రూపంలో కొన్ని నడపాలని నిర్ణయించినట్టు సమాచారం. కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే పలు జాగ్రత్తలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 


రైలెక్కాలంటే ఇవీ నిబంధనలు

- స్లీపర్‌ క్లాస్‌(నాన్‌ ఏసీ) కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నాన్‌స్టాప్‌ పద్ధతిలో (ఒకటి లేదా రెండు స్టేషన్ల మాత్రమే హాల్ట్‌) బయలుదేరే స్టేషన్‌ నుంచి గమ్యానికి చేరే స్టేషన్‌ వరకు నడుపుతారు.

- ప్రయాణానికి 12గంటల ముందు ప్రయాణికుడు ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారాన్ని రైల్వే అధికారులకు తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రయాణించే సమయంలో కరోనా లక్షణాలు బయటపడితే, సదరు ప్రయాణికుడిని మధ్యలో ఏదైనా స్టేషన్‌లో దించి వేసి, టికెట్‌ సొమ్మును పూర్తిగా వాపసు చేస్తారు.

- బెర్తు ఖరారైనవారికి మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. సీనియర్‌ సిటిజన్లను అనుమతించరు.

- ప్రయాణికులు 4గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రత్యేక మార్గం ద్వారా భౌతిక దూరం పాటిస్తూ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ పూర్తయిన తర్వాత కోచ్‌ల్లో ప్రవేశించాలి. ప్లాట్‌ఫాం టికెట్ల విక్రయాలు ఉండవు.

- థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు ముగిసిన తర్వాత గ్లౌజులు, మాస్క్‌లకు, నామమాత్రపు రుసుం వసూలుచేస్తారు.

- కోచ్‌లోని క్యాబిన్‌కు ఇద్దరు మాత్రమే ప్రయాణించే విధంగా బెర్తులు కేటాయిస్తారు. సైడ్‌ బెర్తులను ఖాళీగా వుంచుతారు. రైళ్లలో క్యాటరింగ్‌ సర్వీసు ఉండదు.


Updated Date - 2020-04-10T07:31:02+05:30 IST