రైల్వే సీజనల్‌ టిక్కెట్లపై స్పష్టత కరువు

ABN , First Publish Date - 2021-07-22T05:07:45+05:30 IST

రైల్వే సీజనల్‌ టిక్కెట్‌ పాస్‌లపై గుంటూరు డివిజన్‌లో అస్పష్టత నెలకొంది.

రైల్వే సీజనల్‌ టిక్కెట్లపై స్పష్టత కరువు

పాస్‌ల కోసం రైల్వేస్టేషన్లకు వెళ్లి సీజనర్స్‌ వాకబు

నేటికీ విడుదల కాని స్పష్టమైన ఆదేశాలు 

గుంటూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రైల్వే సీజనల్‌ టిక్కెట్‌ పాస్‌లపై గుంటూరు డివిజన్‌లో అస్పష్టత నెలకొంది. ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ జరిగిన దృష్ట్యా నిత్యం గుంటూరు, విజయవాడ, తెనాలి, రేపల్లె, మంగళగిరి, పెదకాకాని, నంబూరు, నరసరావుపేట, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్ల మధ్యన రాకపోకలు సాగించే సీజనర్స్‌ పాస్‌ల కోసం రైల్వేస్టేషన్లకు వెళ్లి వాకబు చేస్తున్నారు. అయితే చాలా స్టేషన్లకు పాస్‌లు జారీకి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో సంబంధిత స్టేషన్‌మాష్టర్లు రేపు రండి, ఎల్లుండి రండి అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లకు ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలను నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీజనల్‌ పాస్‌కి గతంలో నిర్ణయించిన నగదునే చెల్లించుకోవాలా/ కొత్త టారిఫ్‌ ఏమైనా ఇస్తారా అన్న విషయం కూడా స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 

కొవిడ్‌ ఫస్టు వేవ్‌ లాక్‌డౌన్‌కి ముందు నుంచే రైల్వే శాఖ ప్యాసింజర్‌ రైళ్లను నిలిపేసిన విషయం తెలిసిందే. అప్పటికే చాలామంది సీజనర్లు పాస్‌లు తీసుకొని ఉన్నారు. లాక్‌డౌన్‌ నాటికి వారి పాస్‌ల గడువు వ్యవధి ఇంకా మిగిలి ఉన్నది. దాని దృష్ట్యా సీజనర్లు నష్టపోకుండా అప్పట్లో ఎన్ని రోజులు అయితే మిగిలి ఉన్నాయో, ఆ వ్యవధిని పొడిగించాలని రైల్వేబోర్డు తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఆ మేరకు ఇప్పుడు గతంలో జారీ చేసిన పాస్‌ల వ్యవధిని పొడిగించాలి. అయితే దీనిపై రైల్వే కమర్షియల్‌ విభాగం నుంచి నిర్ధిష్టమైన ఆదేశాలు ఇంకా స్టేషన్‌మాస్టర్లకు చేరలేదు.   

కాగా గతంలో గుంటూరు - విజయవాడ, గుంటూరు - తెనాలి, తెనాలి - విజయవాడకు ప్యాసింజర్‌ రైలు టిక్కెట్‌ ఛార్జీ రూ.10గా ఉండేది. ఇప్పుడు దానిని రూ.30కి పెంచారు. అలానే గుంటూరు నుంచి రేపల్లెకు రూ.35 చేశారు. గుంటూరు నుంచి పెదకాకానికి రూ.30 చేశారు. గుంటూరు నుంచి మాచర్లకు రూ.60గా నిర్ణయించారు. గతంలో ఈ ఛార్జీలు ఇందులో సగం కూడా ఉండేవి కావు. ఈ నేపథ్యంలో సీజనల్‌ పాస్‌ల జారీపై స్పష్టత కొరవడింది.

యూటీఎస్‌ యాప్‌లో మాత్రం సీజనల్‌ టిక్కెట్‌లు జారీ అవుతున్నాయి. గతంలో గుంటూరు - విజయవాడ మధ్యన నెలకు రూ. 135 వరకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.185కి పెంచారు. అలానే సీజనల్‌ పాస్‌ రెన్యువల్‌ ఆప్షన్‌ కూడా యాక్టివేట్‌ అయింది. అయితే సీజనర్లు ఎక్కువగా టిక్కెట్‌ కౌంటర్‌లలో పాస్‌లు తీసుకొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో తమకు త్వరగా పాస్‌లు జారీ చేయాలని సీజనర్లు కోరుతున్నారు. 


Updated Date - 2021-07-22T05:07:45+05:30 IST