రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-05-03T06:09:25+05:30 IST

గుడివాడ పట్టణంలో 214 జాతీయ రహదారి భీమవరం, మచిలీపట్నం రైల్వేగేట్లపై ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

భీమవరం, బందరు గేట్లపై నిర్మించేందుకు రూ.328 కోట్లు 

 సర్వే నిర్వహిస్తున్న జాతీయ రహదారులశాఖ అధికారులు

గుడివాడ టౌన్‌, మే 2 : గుడివాడ పట్టణంలో 214 జాతీయ రహదారి భీమవరం, మచిలీపట్నం రైల్వేగేట్లపై ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన స్థలసేకరణ, డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టుకు జాతీయ రహదారులశాఖ అధికారులు సిబ్బంది సర్వే పనులు ప్రారంభించారు. భీమవరం రైల్వేగేట్‌, మచిలీపట్నం రైల్వేగేట్‌లపై ఒకే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి గాను రూ.248 కోట్లు కేటాయించినట్లు సమాచారం. బస్టాండ్‌ సమీపంలోని గీతా భవన్‌ రోడ్‌ దగ్గర నుంచి ఫ్లైఓవర్‌ వంతెన పనులు ప్రారంభిస్తారు. భీమవరం రైల్వేగేట్‌, బందరు రైల్వేగేట్‌లను కలుపుతూ బిళ్లపాడు వరకు ఒకే ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. 

అండర్‌ పాస్‌ మౌలిక సదుపాయాలకు రూ.80 కోట్లు 

 రెండు రైల్వేగేట్లపై ఒకే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నందున కొత్త బైపాస్‌ రోడ్డు (బాపినీడు బంక్‌ వద్ద) వై.జంక్షన్‌, పెదకాల్వ సెంటర్‌లో మరో ‘వై’ జంక్షన్‌తో సహా ఒకే ఫ్లైఓవర్‌ బస్టాండ్‌ దగ్గర నుంచి బిళ్లపాడు వరకు నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి 2022 జూలై 13న టెండర్లు ఓపెన్‌ చేస్తారని సమాచారం. ఫ్లై ఓవర్‌ బ్రిడ్జికి రెండు వైపులా బిళ్లపాడు వరకు సర్వీస్‌ రోడ్‌ల నిర్మాణం కోసం స్థల సేకరణ మొదలు పెట్టారు. భీమవరం రైల్వేగేటు, మచిలీపట్నం రైల్వేగేటు దగ్గర అండర్‌ అండర్‌ పాస్‌ రహదారిని నిర్మించనున్నారు. స్థల సేకరణకు అండర్‌ పాస్‌, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలకు రూ.80కోట్లు కేటాయించినట్లు తెలిసింది. వెరసి రూ.328 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సర్వే ప్రారంభమైంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణ ప్రజలకు చిరకాల వాంఛ నెరవేరనుంది. 

 రోజుకు 58 రైళ్ల రాకపోకలు

 జాతీయ రహదారి 214లో భీమవరం, మచిలీపట్నం రైల్వేలైన్లలో ఒక్క భీమవరం వైపే రోజుకు 58 ఎక్స్‌ప్రెస్‌ ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటారు. గేటు తీయడానికి పదినిమిషాలు, ట్రాఫిక్‌ ఫ్రీగా ఉన్నప్పటికీ మళ్లీ గేటు వేయడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ఆటోనగర్‌ కార్మికులు, ప్రయాణికులతో సహా ప్రమాదకర స్థితిలో ఉన్న రోగులు సైతం రైల్వేగేటుల వల్ల తీవ్ర నరకం చవిచూస్తున్నారు. రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి అయితే జనం ఊపిరి పీల్చుకుంటారు. 



Read more