రైళ్ల రాకపోకలకు సర్వం సిద్ధం!
ABN , First Publish Date - 2020-06-01T09:24:46+05:30 IST
రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు సోమవారం సాధారణ రైళ్ల రాకపోకలు మొదలవుతున్నాయి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు సోమవారం సాధారణ రైళ్ల రాకపోకలు మొదలవుతున్నాయి. తొలిరోజు విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా మొత్తం ఆరు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వీటిలో తొలి రైలు గుంటూరు - సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 07201). ఇది ఉదయం 6.30 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్కు వస్తుంది. రెండో రైలు సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వచ్చే గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇది విజయవాడ స్టేషన్కు రాత్రి ఎనిమిది గంటలకు వస్తుంది.
దానాపూర్ - బెంగళూరు (సంఘమిత్ర ఎక్స్ప్రెస్) రాత్రి 10 గంటలకు, సికింద్రాబాద్ - హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రాత్రి 10.30 గంటలకు, విశాఖపట్నం - సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ 11.10 గంటలకు, విశాఖపట్నం - సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ 11.15 గంటలకు వస్తాయి. రైళ్ల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ప్రయాణికుల, రైల్వే సిబ్బంది వ్యక్తిగత భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, నిబంధనలను విధిగా అమలు చేసేలా చర్యలు చేపట్టారు.