విషాదం

ABN , First Publish Date - 2022-06-29T04:26:47+05:30 IST

మండల పరిధిలోని మృకుండాశ్రమంలో విషాదం నెలకొంది. కొడుకు రైలు కింద పడి మృతి చెందగా మృతదేహాన్ని చూసిన తల్లి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విషాదం
బాలరాజు, సుబ్బలక్షుమ్మ (ఫైల్‌)

ఒకేరోజు తల్లీకొడుకు మృతి

రైలు కింద పడి కుమారుడు...

మృతదేహాన్ని చూసి గుండెపోటుతో తల్లి...

ఒంటిమిట్ట, జూన్‌ 28 : మండల పరిధిలోని మృకుండాశ్రమంలో విషాదం నెలకొంది. కొడుకు రైలు కింద పడి మృతి చెందగా మృతదేహాన్ని చూసిన తల్లి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. మృకుండాశ్రమానికి చెందిన బాలరాజు (35) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న తల్లి సుబ్బలక్షుమ్మ (56) కుమారుడి మృతదేహం చూసి భోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించేలోగానే ఆమె మృతి చెందింది. టీ దుకాణం నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ గడుపుతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకోవడంతో పాటు కుటుంబసభ్యులు, గ్రామస్థుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన యువకుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు చిన్న పిల్లలు కావడంతో చూపరులను కలచివేసింది. బాలరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. కుటుంబ సమస్యలు ఏమీ లేవని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియడం లేదని గ్రామస్థులు చెప్పారు. పెద్దదిక్కు కోల్పోవడంతో తాము రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. అనాథలైన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల టీడీపీ నాయకులు బొబ్బిలి రాయుడు, కిరణ్‌స్వామి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-29T04:26:47+05:30 IST