పాయకరావుపేట, తునిలో విషాదం
ABN , First Publish Date - 2021-11-30T06:08:09+05:30 IST
జిల్లాలోని పరవాడ వద్ద గల ఫార్మాసిటీలో వెలుగు చూసిన సంఘటన పాయకరావుపేట, తుని మండలం వెలమకొత్తూరు గ్రామాల్లో విషాదాన్ని నింపింది.
‘ఫార్మా సిటీ’ ప్రమాదంలో మృతులు ఈ ప్రాంతాలకు చెందినవారే.... ఇద్దరూ మంచి స్నేహితులు
ఒకరు ‘పేట’ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెదిరెడ్డి శ్రీను చిన్న కుమారుడు మణికంఠ కాగా..
మరొకరు తుని మండలం వెలమకొత్తూరుకు చెందిన దుర్గాప్రసాద్
పాయకరావుపేట, నవంబరు 29 : జిల్లాలోని పరవాడ వద్ద గల ఫార్మాసిటీలో వెలుగు చూసిన సంఘటన పాయకరావుపేట, తుని మండలం వెలమకొత్తూరు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతిచెందిన ఇద్దరు యువకులు ఈ ప్రాంతానికి చెం దిన స్నేహితులు కావడం మరో విశేషం. పాయకరావుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పెదిరెడ్డి శ్రీను చిన్న కుమారుడు మణికంఠ (22), అతని స్నేహితుడు తుని మండలం వెలమకొత్తూరుకు చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్ (21) పరవాడలోని జవహలాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఆదివా రం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో అసువులు బాశారు. ఈ ఇద్దరూ ఇంటర్మీడియట్ నుంచి మంచి స్నేహితులు. మణికంఠ పాలిటెక్నిక్ పూర్తిచేసిన తరువాత బీఎస్సీ చదివి మూడు నెలల క్రితం ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. దుర్గాప్రసాద్ కూడా గాజువాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ పూర్తిచేసి పది రోజుల కిందటే పరిశ్రమలో చేరాడు. ఒకేసారి, ఒకేచోట ఇద్దరినీ మృత్యువు కబళించింది. పుత్రశోకంలో ఉన్న పెదిరెడ్డి శ్రీను కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక అన్నంరెడ్డి దుర్గాప్రసాద్ది తుని మండలం వెలమకొత్తూరు గ్రామం. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా, తల్లి వెంకటలక్ష్మి, సోదరి పుష్ప ఉన్నారు. ఇటీవలే ఫార్మా కంపెనీలో ఒప్పంద ఉద్యోగిగా చేరి మృత్యువాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.