సరికొత్తగా సిగ్నల్స్‌

ABN , First Publish Date - 2022-01-19T06:21:18+05:30 IST

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసు శాఖ కొత్త ప్రణాళికలను తయారు చేసింది.

సరికొత్తగా సిగ్నల్స్‌
మహానాడు రోడ్డు కూడలిలో సిగ్నల్స్‌

25 కూడళ్లలో మరమ్మతులు

15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాట్లు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసు శాఖ కొత్త ప్రణాళికలను తయారు చేసింది. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 30 కూడళ్లలో సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆయా కూడళ్లలో ఎంతసేపు ట్రాఫిక్‌ ఆగుతుందో తెలిసేలా టైమర్‌ను అమర్చుతారు. ఇప్పటికే మహానాడు జంక్షన్‌లో సిగ్నల్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు, మూడు చోట్ల మాత్రమే సిగ్నల్స్‌ పనిచేస్తున్నాయి. రెండు వారాల్లో మొత్తం 25 జంక్షన్లలో సిగ్నల్‌ వెలుగులు కనిపించనున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ అధునాతన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయనున్నారు.


బెంజ్‌సర్కిల్లో తీగల సిగ్నల్స్‌ 

నగరంలోని అతిపెద్ద ట్రాఫిక్‌ జంక్షన్‌ బెంజ్‌సర్కిల్‌. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం రూ.25లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇక్కడ ఐలాండ్‌ను పునరుద్ధరించే పనులను వీఎంసీ త్వరలో చేపట్టనున్నది. ఇటు ఫకీర్‌గూడెం వైపు, అటు నిర్మలా కాన్వెంట్‌ కూడలి వైపు తీగలతో వేలాడే సిగ్నల్స్‌ను అమర్చుతారు. ఇవి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తాయి. ఇవి కాకుండా ఎంజీ రోడ్డు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ నియంత్రణకు కూడా సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తారు. బెంజ్‌సర్కిల్లో మొత్తంగా ఎనిమిది సిగ్నల్‌ లైట్లను వాహనాల కోసం, మరో నాలుగు లైట్లను పాదచారుల కోసం ఏర్పాటు చేయనున్నారు. వీటికి తోడు నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు పలు మార్పులు చేశారు.

Updated Date - 2022-01-19T06:21:18+05:30 IST