విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2022-04-27T12:58:21+05:30 IST
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో విజయవాడ నగరంలో బుధవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకు
విజయవాడ : సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో విజయవాడ నగరంలో బుధవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకు పంజాసెంటర్లో ఉన్న ముసాఫిర్ ఖానాను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఈ కారణంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు పోలీసు కమిషనర్ టి.కాంతిరాణా తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
వీజీ చౌక్ నుంచి పంజా సెంటర్ వైపు, వించిపేట నుంచి రైల్వేస్టేషన్ పశ్చిమ టికెట్ బుకింగ్ వైపు వాహనాలను అనుమతించరు.
వీజీ చౌక్ నుంచి వాహనాలను బ్రాహ్మణ వీధి మీదుగా రథం సెంటర్ వైపు మళ్లిస్తారు.
సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటలకు వరకు ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజ్సర్కిల్ వైపు వాహనాలను అనుమతించరు.
ఆర్టీసీ వై జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు, ఐదో నెంబర్ రోడ్డులో వెళ్లే బస్సులను కారల్మార్క్స్ రోడ్డు, రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్సర్కిల్ వైపు మళ్లిస్తారు.
బెంజ్సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోకి వెళ్లే బస్సులను రామవరప్పాడు రింగ్ వైపు, కొన్నింటిని వారధి వైపు నుంచి పీఎన్బీఎస్కు పంపుతారు.
విందుకు ప్రవేశం, పార్కింగ్ ఇలా
ఇందిరాగాంధీమున్సిపల్ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు వచ్చే ఏ-1 పాసు కలిగిన ఆహ్వానితులు రెండో నెంబర్ గేటు నుంచి లోపలకు వచ్చి, ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద వాహనాలను నిలుపుకోవాలి.
విందుకు హాజరయ్యే ముస్లింలు ఈట్ స్ట్రీట్ వైపు ఉన్న నాలుగో నెంబర్ గేటు, వాటర్ ట్యాంక్ వైపు ఉన్న ఆరో నెంబర్ గేటు నుంచి స్టేడియంలోకి రావొచ్చు.
మీడియా ప్రతినిధులకు రెండో నెంబర్ గేటు నుంచి ప్రవేశం కల్పించారు.
పాసులు కలిగిన వారు సాయంత్రం 5.30 గంటలలోపు స్టేడియంలోకి చేరుకోవాలి.
విందుకు హాజరయ్యేవారు వాహనాలను రెడ్సర్కిల్ వద్ద ఉన్న బిషప్ అజరయ్య స్కూల్ ప్రాంగణంలో నిలుపుకోవాలి.
బస్సులు, ఆటోలు, మినీ వ్యాన్లలో వచ్చే వారు గేటు నెంబర్ నాలుగు వద్ద గానీ, ఆరో నెంబర్ గేటు వద్ద గానీ దిగి, స్టేట్ గెస్ట్హౌస్ వద్ద వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.