జూన్ 4 వరకు బేగంపేట్ పీఎస్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2022-04-23T21:21:46+05:30 IST
నగరంలోని బేగంపేట్ పీఎస్ పరిధిలో జూన్ 4 వరకు ట్రాఫిక్
సికింద్రాబాద్: నగరంలోని బేగంపేట్ పీఎస్ పరిధిలో జూన్ 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీటీఓ జంక్షన్ రసూల్పురా నాలా మరమ్మత్తుల పనులను సీపీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అమలు అవుతున్న ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. జూన్ 4వ తేదీ వరకు బేగంపేట్- రసూల్పురా వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. రసూల్పురా నాలా మరమ్మతుల కారణంగా అమలవుతున్న ఆంక్షలు, ట్రాఫిక్ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ట్రాఫిక్ పోలీసులతో సీపీ చర్చించారు. సీటీవో నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం మీదుగా మళ్లించాలన్నారు. బేగంపేట నుంచి వాహనాలను రసూల్పురా నుంచి కిమ్స్ వైపుగా మళ్లించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉండడంతో వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.