జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
ABN , First Publish Date - 2022-01-09T02:07:51+05:30 IST
సంక్రాంతి పర్వదినం, వరుస సెలవులు నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది.
చౌటుప్పల్: సంక్రాంతి పర్వదినం, వరుస సెలవులు నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్, కర్ఫ్యూ వంటి పుకార్ల మధ్య వీలైన వారంతా కుటుంబసభ్యులు, సామాన్లతో గ్రామాలకు బయలుదేరటంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ నెల 7వ తేదీ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం నుంచే రాష్ట్ర రాజధాని నుంచి పెద్దసంఖ్యలో వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నాయి. సంక్రాంతి పండుగకు ఏపీ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు వెళ్లేందుకు హైదరాబాద్-విజయవాడ రహదారే ప్రధాన మార్గం కావడం, హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ ప్రాంతానికి చెందిన వారంతా ఈ మార్గం నుంచే వెళ్తుండటంతో జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి మూడు, నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చేవారు. ఈ ఏడాది ఎనిమిది రోజులు సెలవులు ప్రకటించడంతో ముందస్తుగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో ప్రతి ఏడాది కన్నా మూడు రోజుల ముందుగానే హైవేపై రద్దీ నెలకొంది.