స్టోన్హౌస్పేటలో ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2022-01-23T05:13:11+05:30 IST
శనివారం ఒక్కసారిగా స్టోన్హౌస్పేట బ్రిడ్జి నుంచి నవాబుపేట సెంటర్ వరకు వాహనాలు ఆగిపోయాయి
ఓ దారిని మూసేసిన పోలీసులు
ఎందుకు సార్ అని ప్రశ్నిస్తే బూతులతో సమాధానం
నరకయాతన అనుభవించిన ప్రజలు
నెల్లూరు(క్రైం),జనవరి 22: నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రమైన స్టోన్హౌస్పేట ప్రాంతం నుంచి రోజూ వేలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఓ బస్సు మాత్రమే పట్టే రోడ్లు మాత్రమే అటు ఇటు వైపు ఉన్నాయి. అయినా ప్రజలు వ్యాపార కూడలి కావడంతో ట్రాఫిక్ కష్టాలు మాములే అనుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే శనివారం ఒక్కసారిగా స్టోన్హౌస్పేట బ్రిడ్జి నుంచి నవాబుపేట సెంటర్ వరకు వాహనాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో ఎందుకు వాహనాలు ఆగాయని ప్రజలందరూ గంటల సమయం ఎదురు చూసి ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ క్రమంలో తడికల బజారు సెంటర్ వద్ద పోలీసులు ప్రయాణికులతో ఇష్టాను సారంగా మాట్లాడుతూ ప్రజలను బూతులు తిట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రజలు, పత్రిక విలేకర్లు ఇదెక్కడి న్యాయం సార్ అని ప్రశ్నిస్తే అంతే.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ విషయమై నవాబుపేట ఇన్స్పెక్టర్ సుబ్బారావును వివరణ కోరగా ఆ పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అని సమాధానం ఇచ్చారు. అయితే ప్రజలు మాత్రం ఇదేనా ప్రైండ్లీ పోలీసింగ్ అంటే సారూ అని ప్రశ్నిస్తున్నారు.