సంప్రదాయబద్ధంగా అప్పన్న గజేంద్రమోక్షోత్సవం

ABN , First Publish Date - 2021-01-16T04:41:20+05:30 IST

సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం గజేంద్ర మోక్షోత్సవాన్ని కరోనా నేపథ్యంలో ఏకాంత సేవగా జరిపారు.

సంప్రదాయబద్ధంగా అప్పన్న గజేంద్రమోక్షోత్సవం
వరద రాజాలంకరణలో గోవిందరాజస్వామి, కొలను ఒడ్డున మకరం, గజేంద్రుడు ప్రతిమలు

సింహాచలం, జనవరి 15: సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం గజేంద్ర మోక్షోత్సవాన్ని  కరోనా నేపథ్యంలో ఏకాంత సేవగా జరిపారు. ప్రతి ఏటా కొండదిగువ స్వామివారి పూదోటలో ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శంఖు, చక్రాలు, కటి, అభయ హస్తాలతో వరద రాజస్వామిగా అలంకరించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనములతో ఉత్సవానికి శ్రీకారం చుట్టి షోడశోపచారాలను సమర్పించారు. ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో అధ్యాపకుడు టీపీ రాజేష్‌ భాగవతంలోని ‘గజేంద్ర మోక్షం’ ఘట్టాన్ని పారాయణం చేశారు. అనంతరం స్వామివారిని కొలను వద్దకు తీసుకువెళ్లి మకరవేట (గజేంద్ర మోక్షం) ఉత్సవాన్ని నిర్వహించారు. దీనికి ప్రతీకగా మూడు తారాజువ్వలను వదలడం, వాటి గమనాన్ని బట్టి పంటల పరిస్థితిని అంచనా వేస్తుంటారు. ఈ ఏడాది మొదటి రెండు జువ్వలు పూర్తిస్థాయిలో గమనం సాగించగా, మూడవది మధ్యలోని నిలిచిపోయింది. మొదటి, రెండో జువ్వల గమనాన్ని బట్టి వరి, అపరాల పంటలు పుష్కలంగా పండుతాయని, మూడవ జువ్వ నిలిచిపోవడంతో మెట్ట పంటలు అంతగా కలిసి రావని రైతులు అంచనా వేస్తున్నారు. అనంతరం భక్తుల హరినామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. దేవాలయ పర్యవేక్షణాధికారి వి.కామేశ్వరరావు, హవాల్దార్‌ రాజగోపాల్‌, తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T04:41:20+05:30 IST