ప్రాణంతీసిన ఈత సరదా
ABN , First Publish Date - 2020-11-01T09:42:41+05:30 IST
ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలంలోని రాళ్లబూదుగూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.
శాంతిపురం, అక్టోబరు 31: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలంలోని రాళ్లబూదుగూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రాళ్లబూదుగూరుకు చెందిన టైలర్ మురళి కుమారుడు సందీప్(20) కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. శనివారం క్లాసులు లేకపోవడంతో స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని కోనేరులో ఈతకు వెళ్లాడు. కోనేరులో దిగిన కొంతసేపటికే బురదలో చిక్కుకుని ఊపిరాడక మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రెండుగంటల గాలింపు అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. రాళ్లబూదుగూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.