శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా భాగ్‌సవారి ఉత్సవం

ABN , First Publish Date - 2020-09-29T12:11:11+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం సాయంత్రం ‘భాగ్‌సవారి ఉత్సవం’ ఏకాంతంగా జరిగింది.

శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా భాగ్‌సవారి ఉత్సవం

తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం సాయంత్రం ‘భాగ్‌సవారి ఉత్సవం’ ఏకాంతంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన  మరుసటిరోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ కథనం మేరకు... స్వామివారి భక్తాగ్రేసరుడైన అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవరూపంలో విచ్చేస్తారు.పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారు అశ్వత్తవృక్షానికి బంధిస్తాడు.


స్వామిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతాడు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి వచ్చింది సాక్షాత్తు స్వామివారేనని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని  విముక్తురాలిని చేసి, పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామి చెంతకు చేరుస్తాడు.ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు బ్రహ్మోత్సవాల మరుసటి రోజు అనంతాళ్వార్వుల తోటలోకి అప్రదక్షిణగా విచ్చేసి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిస్తాడు.


ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ భాగ్‌సవారి ఉత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతిదిశగా ఉన్న పురుశైవారితోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్యప్రబంధం, శాత్తుమొర నిర్వహించారు. 

Updated Date - 2020-09-29T12:11:11+05:30 IST