నేడే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, పాలిసెట్
ABN , First Publish Date - 2020-09-27T10:58:56+05:30 IST
దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.
తిరుపతి (విద్య), సెప్టెంబరు 26: దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-1,2లుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఇందుకోసం తిరుపతిలో ఐదు, పుత్తూరులో రెండు, చిత్తూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ నరసింహమూర్తి తెలిపారు. విద్యార్థులను రెండు గంటల ముందునుంచే పరీక్ష కేంద్రాల్లోకి కొవిడ్ మార్గదర్శకాల మేరకు అనుమతిస్తారని పేర్కొన్నారు.
అలాగే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ కూడా ఆదివారమే జరగనుంది. తిరుపతి, మదనపల్లె, కలికిరి, కుప్పం జోన్లలోని 17 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిసెట్ నిర్వహిస్తారు.
ఉదయం తొమ్మిది గంటలనుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను కొవిడ్ మార్గదర్శకాల మేరకు అనుమతిస్తామని కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎల్.కృష్ణసాయి తెలిపారు. ఈ రెండు పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.