టమోటా రైతులను దోచేస్తున్నారు

ABN , First Publish Date - 2020-09-27T10:56:39+05:30 IST

మదనపల్లె టమోటా మార్కెట్‌లో రైతులను దోచేస్తున్నారంటూ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

టమోటా రైతులను దోచేస్తున్నారు

 మహిళా రైతు ఆవేదన 

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 26: మదనపల్లె టమోటా మార్కెట్‌లో రైతులను దోచేస్తున్నారంటూ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బండ్రేవారిపల్లెకు చెందిన కళావతి తాను పండించిన టమోటాలతో పాటు, పక్క రైతుల టమోటాలను కొనుగోలు చేసి గురువారం రాత్రి మదనపల్లె మార్కెట్‌కు  తీసుకొచ్చారు.


శుక్రవారం ఉదయం ఎంఎస్‌ఆర్‌ మండీలో కళావతి తీసుకొచ్చిన 25 కేట్లు(30 కిలోల చొప్పు) విక్రయానికి ఉంచారు. వేలం పాటల్లో వ్యాపారులు కళావతి టమోటా క్రేటు రూ.250 ధర నిర్ణయించారు. పక్క మండీలో క్రేటు రూ.600 ధర పలికితే తన క్రేటు కేవలం రూ.250 ధర నిర్ణయించడం ఏమిటని కళావతి మండీ యజమాని దృష్టికి తీసుకెళ్లగా శనివారం మంచి ధర వస్తే విక్రయిస్తానని చెప్పారు.


శనివారం ఉదయానికి కళావతి తీసుకొచ్చిన టమోటాల్లో కొన్ని పండుకాగా, వాటిని ఏరివేసి నాణ్యమైన టమోటాలను ఏరి 16 క్రేట్లలో పోసి విక్రయానికి వుంచారు. వేలం పాటల్లో వ్యాపారులు ఒక్కో క్రేటుకు కేవలం రూ.60 ధరమాత్రమే నిర్ణయించడంతో కళావతి హతాశురాలైంది. నిన్న చూస్తే రూ.250 చెప్పి ఇప్పుడు రూ.60 నిర్ణయించడం ఏంటని బోరున విలపించింది.


తనకు మండీ వ్యాపారులు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయింది. విషయం తెలుసుకున్న మార్కెట్‌యార్డు కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి ఎంఎస్‌ఆర్‌ మండీ యజమానితో చర్చించి కళావతి టమోటాకు క్రేటుకు రూ.250 ధర చెల్లించాలని ఆదేశించారు. మార్కెట్‌లో అవకతవకలను ప్రక్షాళన చేస్తామన్నారు.  

Updated Date - 2020-09-27T10:56:39+05:30 IST