ఈ సారి రైతుబంధు ఉంటుందా... ఉద్యోగుల జీతాల పరిస్థితేంటి?: Revanth

ABN , First Publish Date - 2022-06-22T17:27:48+05:30 IST

ఉద్యోగులకు జీతాలు, రైతులకు రైతుబంధు నిధులు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

ఈ సారి రైతుబంధు ఉంటుందా... ఉద్యోగుల జీతాల పరిస్థితేంటి?: Revanth

హైదరాబాద్: ఉద్యోగులకు జీతాలు, రైతులకు రైతుబంధు నిధులు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరుకుందని విమర్శించారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. జూన్ నెల కూడా ముగుస్తున్నా... ఇంత వరకు వారికి మే నెల జీతం కూడా ఇవ్వని తమరి నిర్వాకాన్ని ఏమని ప్రశ్నించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్ స్కూళ్లలో టీచింగ్ - నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. వారు కూడా మే నెల జీతాల కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వారికి నెల జీతం ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని టీపీసీసీ చీఫ్ లేఖలో నిలదీశారు.


తొలకరి మొదలై... వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. ఈ సారి రైతుబంధు ఉంటుందా... ఉంటే ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. అసలు ఇస్తారా లేదా అని పేద రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ‘‘మీరేమో బీఆర్ఎస్... వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందన్నారు. ‘‘మీ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాళా తీసిందన్న విషయం అర్థమవుతోంది. అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారన్న విషయం తెలుస్తూనే ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి’’ అంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-22T17:27:48+05:30 IST