వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారు: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-26T23:35:43+05:30 IST

వరి వేస్తే ఉరేనన్న సీఎం కేసీఆర్.. తన 150 ఎకరాల్లో వరి వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన రేవంత్.. రైతు సమస్యలపై..

వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: వరి వేస్తే ఉరేనన్న సీఎం కేసీఆర్.. తన 150 ఎకరాల్లో వరి వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన రేవంత్.. ‘‘కేసీఆర్ సొంత పొలంలో పండుతున్న వరిని ఎవరుకొంటారో చెప్పాలి. కేసీఆర్ వరిని ఎంతకు కొంటారు, ఎక్కడ కొంటారో చెప్పాలి. వరి వేయొద్దన్న టీఆర్‌ఎస్‌ నేతల్ని చెప్పుతో కొట్టండి. ఛత్తీస్‌గఢ్‌లో వరి నుంచి ఇతర పంటలవైపు మళ్లేందుకు అక్కడి ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తోంది. ఎకరాకు రూ.9 వేలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలి.’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 



రైతు సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంభిస్తోందని రేవంత్ మండిపడ్డారు.. రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయిస్తున్నారని ఆయన చెప్పారు. పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని రేవంత్ మండిపడ్డారు. యూపీ, పంజాబ్‌ ఎన్నికల కోసమే సాగుచట్టాలు రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ఎంఎస్‌పీ విధానం తెచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. రైతుల్ని బానిసలుగా చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు కేంద్రం సాయం చేయలేదని,  కనీసం వారి వివరాలు కూడా సేకరించలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 




Updated Date - 2021-12-26T23:35:43+05:30 IST