పంట పొలాలపై విష వాయువు
ABN , First Publish Date - 2021-10-22T05:30:00+05:30 IST
ఆ ఊళ్లో వాళ్లకు వ్యవసాయమే జీవనాధారం.
- పనులకు రాని వ్యవసాయ కూలీలు
- దెబ్బతింటున్న పంటలు
- తారు ప్లాంటే కారణమంటున్న రైతులు
పాణ్యం, అక్టోబరు 22: ఆ ఊళ్లో వాళ్లకు వ్యవసాయమే జీవనాధారం. వర్షం వస్తేనే విత్తనం మొలకెత్తుతుంది. బోరు బావుల నీటితో పంటలు కళకళలాడుతు న్నాయి. అయితే గజ్జలకొండ వద్ద దాదాపు 60 ఎకరాల భూముల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం పచ్చని పంట పొలాల మధ్య వెలసిన మిక్సింగ్ తారు ప్లాంటే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. 2017లో ఏటిపాయ భూముల్లోని 282 సర్వే నెంబరులో ఓ సంస్థ మిక్సింగ్ తారు ప్లాంటు నిర్మాణం చేపట్టింది. ఈ ప్లాంటు ద్వారా నిత్యం వందలాది టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు బీటీ రోడ్లకు మిక్సింగ్ తారును సరఫరా అవుతోంది.
పంటపొలాలపై విష వాయువు: ప్లాంటు నుంచి వెలువడే విషవాయువుల కాలుష్యంతో సమీపంలోని పంటలు పూర్తిగా దెబ్బతింటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పంట పొలాలలో కలుపులు తీయడానికి, దుక్కిదున్నడానికి, మందు లు చల్లడానికి వ్యవసాయ కూలీలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు ప్లాంటు కాలుష్యానికి గురై అస్వస్థతకు గురవుతున్నారు.
ప్లాంటు నుంచి పొగ రావడంలేదని, ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి పొందాకే ప్లాంటు ఏర్పాటు చేశామని మేనేజర్ ప్రసాద్ తెలిపారు. పొల్యూషన్ అధికారుల అనుమతులు పొందామన్నారు.
తారుప్లాంటు మా రికార్డుల్లో లేదని గ్రామ కార్యదర్శి యశ్వంత్ తెలిపారు. ఇంత వరకు పన్నులు చెల్లించడంలేదన్నారు.
తమ్మరాజుపల్లె తారు ప్లాంటు సమస్య తన దృష్టికి రాలేదని, రైతులు సమస్యను తీసుకువస్తే పరిశీలించి చర్యలు చేపడతామని పాణ్యం తహసీల్దార్ రత్నరాధిక తెలిపారు.
అధికారులకు విన్నవించినా ఫలితం లేదు
గత ఏడాది మా సమస్యను పాణ్యం తహసీల్దారు అనూరాధకు విన్నవించాం. అయినా ఫలితం లేదు. ఎకరా సొంత పొలంతో పాటు మూడెకరాలు కౌలు తీసుకొని సాగు చేస్తున్నా. పత్తి పంట నల్లగా మారిపోయింది.
- శ్రీనివాసులు, రైతు, తమ్మరాజుపల్లె
కూలీలు పనికి రావడం లేదు
తారు ప్లాంటు నిర్మాణంతో కూలీలు పనికి రావడంలేదు. ఏటా వేలాది రూపాయల పంట నష్టపోతున్నాము. ఎకరా బెండ సాగు చేసుకుంటున్నాను. తారు ప్లాంటు పొగతో పంట నష్టపోతున్నాను. ప్లాంటు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి.
- చంద్రమోహన్, తమ్మరాజుపల్లె