క్రీడలకు కరోనా పాఠం!
ABN , First Publish Date - 2020-04-07T10:02:05+05:30 IST
క్రికెట్లో బంతి షైనింగ్ను పెంచడానికి ఉమ్మి పూయడమనేది సర్వసాధారణం. ఉమ్మి పూయకపోతే బంతి సరిగా స్వింగ్ కాదని బౌలర్లు భావిస్తుంటారు. మెరుపు నిలవాలంటే..
కరోనా దెబ్బకు యావత్ క్రీడా రంగమే స్తంభించింది. ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలు రద్దు కావడంతో ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. అయితే, ఈ విపత్తు నుంచి కోలుకొని మళ్లీ టోర్నీలు ఆరంభమైనా.. క్రీడల్లో ప్రధానంగా కొనసాగుతున్న కొన్ని అలవాట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్స్టాప్ పెట్టాలని ‘కరోనా’ చెబుతున్న పాఠం ఏంటో చూద్దాం..
బంతికి ఉమ్మి పూయడం..
క్రికెట్లో బంతి షైనింగ్ను పెంచడానికి ఉమ్మి పూయడమనేది సర్వసాధారణం. ఉమ్మి పూయకపోతే బంతి సరిగా స్వింగ్ కాదని బౌలర్లు భావిస్తుంటారు. మెరుపు నిలవాలంటే ఉమ్మి పూయడం తప్ప వేరే మార్గం లేదని భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలా చేయకపోతే బ్యాట్స్మన్ సులువుగా స్ట్రోక్స్ ఆడతాడని తెలిపాడు. కానీ, ప్రస్తుత భయానక పరిస్థితుల్లో ఆ అలవాటుకు మాత్రం చెక్ పెట్టాల్సిందే. ఒకరినుంచి ఒకరికి వైరస్లు దరిచేరకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలను నిరోధించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కరచాలనాలు వద్దు..
కరోనా ప్రబలడంతో టాప్ ఫుట్బాల్ లీగుల్లో కరచాలనాలను రద్దు చేశారు. దీంతోపాటు ఫ్యాన్స్కు ఆటోగ్రాఫులు, సెల్ఫీలపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రముఖ జట్టు లివర్పూల్ అయితే మస్కట్లను కూడా నిషేధించింది. ప్రముఖ బాస్కెట్బాల్ లీగ్ ఎన్బీఏ కూడా ఎప్పటి నుంచో అమలు చేస్తున్న‘హై-ఫైవ్’ను ఇటీవలే బ్యాన్ చేసింది.
ఆ స్థానంలో ‘ఫిస్ట్ బం్ప్’ చేయాలని ఆటగాళ్లను కోరింది. కరచాలనాలకు కూడా దూరంగా ఉండాలని సూచించింది.
టెన్నిస్లో టవల్స్..
మ్యాచ్ ఆడే సమయంలో టెన్నిస్ ప్లేయర్లు టవల్స్తో చెమట తుడుచుకుని వాటిని పట్టుకోమంటూ బాల్ బాయ్స్ లేదా గాళ్స్కు విసరడం చూస్తుంటాం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇలాంటి వాటిని అరికట్టడానికి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని టెన్నిస్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటీవల జపాన్, ఈక్వెడార్ మధ్య జరిగిన డేవి్సకప్ మ్యాచ్లో బాల్బాయ్స్ గ్లౌజులు ధరించి కనిపించారు. టవల్స్ వేయడానికి ప్రత్యేకంగా బాస్కెట్లను ఏర్పాటు చేశారు. కరోనాలాంటి వైరస్ల నేపథ్యంలో ఇంతకంటే మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రీస్
ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపాస్ అన్నాడు.