హార్సిలీహిల్స్‌లో పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో వారం రోజులుగా పర్యాటకుల సందడి అధికంగా ఉంది.

హార్సిలీహిల్స్‌లో పర్యాటకుల సందడి
అడ్వెంచర్‌ పార్కులో ట్రెక్కింగ్‌ చేస్తున్న పర్యాటకులు

బి.కొత్తకోట, మే 22 : వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో వారం రోజులుగా పర్యాటకుల సందడి అధికంగా ఉంది. వారాంతపు రోజులలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఈ రెండు రోజులు హిల్స్‌పై పర్యాటకులతో కిండ నిండిపోయింది. హిల్స్‌పై చల్లటి వాతావరణం, ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రావాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చి హిల్స్‌ అందాలను తిలకిస్తూ సంబరంగా గడుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు, యువత అడ్వెంచర్‌ పార్కులో, అంతర మార్గంలో చెక్కల ఊయలలపై ట్రెక్కింగ్‌ తీగలపై సైక్లింగ్‌ చేస్తూ సాహసం చేయరా డింభకా అంటూ సాహస క్రీడలు చేస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్మింగ్‌ చేస్తూ సంతోషంగా గడిపారు. హిల్స్‌పై పార్కులు, గాలిబండ, మినీ జూపార్కులలోను ఘాట్‌రోడ్డులోనూ ఎటు చూసినా పర్యాటకుల సందడి కనిపించింది. వారం రోజులుగా ప్రతిరోజూ పర్యాటకుల రాక పెరుగుతోందని టూరిజం అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST