ఆ ప్రాజెక్టుకు చిరంజీవమే లేదు!

ABN , First Publish Date - 2022-05-16T06:43:59+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన కడియం నర్సరీలకు ఎకో టూరిజం తీసుకురావాలనే కల నెరవేరిందనే ఆనందం పునాదుల్లోనే ఉండిపోయింది.

ఆ ప్రాజెక్టుకు చిరంజీవమే లేదు!
కడియపులంకలో పునాది దాటని ఎకో టూరిజం భవనం

పునాది దాటని ఎకో టూరిజం ప్రాజెక్టు

ఎనిమిదేళ్లుగా ఇంతే

రూ.5 కోట్ల నిధులు వెనక్కు

నాడు కేంద్ర సహాయ మంత్రి హోదాలో చిరంజీవి శంకుస్థాపన

కడియం, మే 15 : దేశవ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన కడియం నర్సరీలకు ఎకో టూరిజం తీసుకురావాలనే కల నెరవేరిందనే ఆనందం పునాదుల్లోనే ఉండిపోయింది. కడియపులంక చెరువు ప్రక్కన ఎకో-టూరిజం భవన నిర్మాణానికి అప్పటి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేశారు.అనంతరం చిరంజీవి స్వయంగా వచ్చి 2014 ఫిబ్రవరి 9వ తేదీన శంకుస్థాపన చేశారు.ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి.   పునాది దశకు వచ్చేసరికి ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. నేటికి ఎనిమిదేళ్లవుతున్నా ఈ ప్రాజెక్టును పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం పునాదులు పిచ్చిమొక్కలతో నిండి ఉన్నాయి. నర్సరీ అం దాలు తిలకించే పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఎకో టూరిజం పనులు ముందుకు కదలకపోవడం విచారకరం. నిధులు వెనుక్కు పోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో శిఽథిలమైన పునాదులే అక్కడ దర్శనమిస్తున్నాయి.దీంతో కడియపులంకకు పర్యాటక శోభ వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది.నిత్యం కడియపులంకకు సందర్శకులు వస్తుంటారు. అయితే వారు రెండు, మూడు రోజులు ఉండేందుకు అనువుగా ఈ ఎకోటూరిజం ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రారంభించారు. సందర్శకులకు ఎటు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వ్యాపారులు తప్ప, సందర్శకులు ఇటు వైపు చూడలేకపోతున్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి కడియపులంక ఎకో టూరిజం ప్రాజెక్టును పూర్తి చేసి అటు పర్యాటకులుకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోను, ఇటు నర్సరీల ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయడంలోను కృషి చేయాలని నర్సరీ రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-16T06:43:59+05:30 IST