టీచర్లకు టార్చర్.. సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి సౌకర్యాలు కల్పించని వైనం
ABN , First Publish Date - 2020-09-25T17:43:50+05:30 IST
జిల్లాలోని 529 సెకండ్ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులకు సంబంధించి..
తూర్పు గోదావరి(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 529 సెకండ్ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులకు సంబంధించి గురువారం సర్టిఫికెట్ల ధ్రువీకరణ కార్యక్రమం కాకినాడ పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అయితే అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏజెన్సీ, రాజమహేంద్రవరం, అమలాపురం వంటి దూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. అయితే కనీసం కుర్చీలు కూడా లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే చెట్ల కింద కూర్చొన్నారు. దరఖాస్తులు నింపేందుకు చాలా అవస్థలు పడ్డారు. గట్ల మీద, బైక్ల మీద పెట్టుకుని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారులతో వచ్చిన తల్లులు మరింత ఇబ్బంది పడ్డారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు వాపోయారు.