కుండపోత వర్షం
ABN , First Publish Date - 2021-11-30T05:34:41+05:30 IST
మండలంలో ఇటీవల కురుస్తున్న జడివానకు ఇండ్లు ఇన్నట్లుండి కూలుతున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఆందోళనలోప్రజలు
పల్లెలను చుట్టుముట్టిన వర్షపు నీరు.. రాకపోకలు బంద్
పోరుమామిళ్ల, నవంబరు 29 : పోరుమామిళ్ల మండలంలో సోమవారం కుండపోత వర్షం కురవడంతో జనజీవనం స్తంభించి పోయిం ది. ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. కనీసం ప్రయాణీకులు బస్టాండ్లోకి వెళ్లి బస్సు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. రంగసముద్రం పంచాయతీ పరిధిలోని కైలా్సకాలనీలోని నివాస గృహాలకు వర్షపు నీరు నడుములలోతు వరకు చేరడంతో రోడ్డుకు లోతట్టు ఉన్న 15 కుటుంబాల వారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ చిత్తా రవిప్రకా్షరెడ్డి, ఎంపీడీవో నూర్జహాన్, ఈవోపీఆర్డీ రమణారెడ్డి ఎక్స్కవేటర్తో రోడ్డు వద్ద గుంతలు తీయించి నీరు బయటకు వెళ్లేలా చేశారు. గిరినగర్లోతట్టు ప్రాంతంలో కూడా వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంగమాంబ హైస్కూల్ కింది భాగాన వర్షపు నీరు ఎక్కువ కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాపు వీధిలో నీళ్ళన్నీ వీధుల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రామిరెడ్డి కుంట, రంగసముద్రం చెరువులు అలుగుపారాయి. గానుగపెంట ప్రాంతంలోని చెరువులు పూర్తిగా నిండాయి. మలిదేవివాగు, ఉధృతం గా ప్రవహించింది. ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ వర్షాన్ని ఎప్పు డూ చూడలేదని రైతులు, ప్రజలు అంటున్నారు. రంగ సముద్రం చెరువు అలుగు పారడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశా రు. ఎంపీడీవో నూర్జహాన్, ఈవోపీఆర్డీ రమణారెడ్డి చెరువు ముప్పు ను తప్పించేందుకు నీటిని బయటకు మళ్లించే ఏర్పాట్లు చేశారు.
పల్లెలను చుట్టుముట్టిన వర్షపు నీరు
కలసపాడు, నవంబరు 29 : మండలంలో సోమవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో పిడిగుపల్లె, లింగారెడ్డిపల్లె గ్రామాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. పిడుగుపల్లె చెరువు అలుగునీరు తెలుగుగంగ కాలువల ద్వారా పోయేందుకు పోరుమామిళ్ల-కలసపాడు ఆర్అండ్బీ రోడ్డుపై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బ్రిడ్జి నిర్మించే సమయంలో పక్కన అప్రోచ్ రోడ్డు నిర్మించి, నీరు పోయేందుకు పైపు లు కూడా ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కురవడంతో వర్షపు నీరు అప్రోచ్ రోడ్డుపై పొర్లి ప్రవహిస్తోంది. ఇలాగే వర్షం కురిస్తే రోడ్డు తెగిపోయే అవకాశం ఉంది. అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జడి వానకు కూలుతున్న ఇళ్లు
బి.కోడూరు, నవంబరు 29 : మండలంలో ఇటీవల కురుస్తున్న జడివానకు ఇండ్లు ఇన్నట్లుండి కూలుతున్నాయి. రామసముద్రం గ్రామం లో నివాసం ఉంటున్న ఇండ్ల సంజీవరెడ్డి ఇళ్లు, అదే గ్రామానికి చెంది న మామిళ్ల చిన్నక్క, మోతె శివరామకృష్ణరావు ఇళ్లు ఉన్నట్లుండి స్లాబ్ కూలికిందపడ్డాయి. ఈ ఇండ్లలో వారు నివాసం ఉంటున్నారు. రోజూ కురిసే వర్షాలకు ఉరుస్తూ ఉండేవి. సోమవారం ఒక్క సారిగా స్లాబ్ కూలి కింద పడిందని బాధితులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ విషయమై తహసీల్దార్ మధుర వాణిని వివరణ అడుగగా ఇప్పటి వరకు పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నాయి. నేడు అన్ని గ్రామాల్లో విచారణ నిర్వహించి పూర్తి వివరాలతో తెలుపుతామని తెలిపారు.