పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక
ABN , First Publish Date - 2022-09-28T06:05:15+05:30 IST
జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
జల, బాల విహార్ ప్రారంభోత్సవంలో కలెక్టర్
కోటప్పకొండ, అనుపుల్లో ఘనంగా పర్యాటక దినోత్సం
నరసరావుపేట, సెప్టెంబరు 27: జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కోటప్పకొండ, అనుపుల్లో మంగళవారం ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాల్ని నిర్వహించారు. కోటప్పకొండలో జలవిహార్లో బోట్ షికార్ను, బాలవిహార్ ఉద్యానవనాల్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనమైన చరిత్ర పల్నాడు జిల్లా సొంతమని చెప్పారు. రెండు నెలల్లో కోటప్పకొండలో ట్రెక్కింగ్ ప్రారంభిస్తామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు మాట్లాడుతూ చారిత్రక సంపద ఉన్న దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ జిల్లా ఇన్చార్జి బీజే బెన్నీ, పీడీలు జోసఫ్కుమార్, బాలూనాయక్, ఓబులనాయుడు, డీఈవో వెంకటప్పయ్య, అటవీశాఖ అధికారులు హుస్సేన్, ఎన్ఎస్బీరాజు, ఆలయ ఈవో గోపి, తహసీల్దార్ రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ సంపదను కాపాడుకోవాలి
విజయపురిసౌత్: వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అమరావతి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ గోపినాథ్ తెలిపారు. ప్రపంచ టూరిజం డే సందర్భంగా అనుపులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పూర్వికుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించాలన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ దీపేందర్నాథ్బోయి, కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య, క్యూరేటర్ కమలాసన్, హార్టికల్చరర్ ఫోర్మన్ ఇస్తతగౌడ్, ఏపీఆర్డీసీ ప్రిన్సిపాల్ వైఎన్ఎస్ చౌదరి, ఏపీఆర్జేసీ ప్రిన్సిపాల్ చందూ ఆంజనేయులు పాల్గొన్నారు.
- హరిత రిసార్ట్ మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏపీఆర్డీసీ కళాశాల, లాంచీ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో లాంచీ యూనిట్ మేనేజర్ భైరవస్వామి, ఏఈ కోటేశ్వరరావు, వినయ్తుల్లా తదితరులు పాల్గొన్నారు.