నేడు నెల్లూరుకు గౌతమ్ పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-02-22T13:47:10+05:30 IST
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తీవ్రమైన గుండెపోటుతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే...
నెల్లూరు : ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తీవ్రమైన గుండెపోటుతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఉదయం 7.30 గంటలకే ఈ వార్త నెల్లూరు జిల్లా ప్రజలకు తెలిసినా తొలువ ఎవరూ విశ్వసించలేదు. కండలు తిరిగిన శరీరంతో చలాకీగా కనిపించే ఆరడగుల ఆజానుబాహువుకు గుండెపోటు ఏమిటి..? అని ఆశ్చర్యపోయారు. అయితే కొన్ని నిమిషాలకే గౌతమ్రెడ్డి ఇక లేరు.. అనే చేదు నిజాన్ని తెలుసుకొని విషాదంలో మునిగిపోయారు. కాగా.. నెల్లూరు జిల్లా ప్రజల సందర్శనార్థం మంగళవారం గౌతమ్రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఉంచనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి వరకు ప్రజల సందర్శనార్థం మేకపాటి నివాసంలో ఉంచుతారు.
అంత్యక్రియలకు వీళ్లంతా..!
గౌతమ్రెడ్డి పార్థివదేహానికి బుధవారం ఉదయగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తొలుత మేకపాటి స్వగ్రామమైన మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వ హించాలని భావించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు రావడానికి వీలుగా హెలిప్యాడ్ సిద్ధం చేశారు. అయితే ఉభయ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు రానున్న దృష్ట్యా అందరి సౌకర్యార్థం అంత్యక్రియలను ఉదయగిరికి మార్చినట్లు తెలిసింది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరు కానున్నారు.