నాలుగు రోజులుగా నిలకడగా టమోటా ధరలు

ABN , First Publish Date - 2022-05-19T06:35:52+05:30 IST

పలమనేరు నియోజకవర్గంలో టమోటా రైతుల పంట పండింది. పలమనేరు మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా 15 కిలోల బాక్సు ధర రూ.వెయ్యి పలుకుతోంది.

నాలుగు రోజులుగా నిలకడగా టమోటా ధరలు
పలమనేరు మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

పలమనేరు, మే 18: పలమనేరు నియోజకవర్గంలో టమోటా రైతుల పంట పండింది. పలమనేరు మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా 15 కిలోల  బాక్సు ధర రూ.వెయ్యి పలుకుతోంది. పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి,  మండలాల రైతులు తాము పండించిన టమోటాలను పలమనేరు మార్కెట్‌కు, వి.కోట మండల రైతులు వి.కోట మార్కెట్‌ కమిటీకి తరలిస్తుంటారు. సరిగ్గా నెల క్రితం  పలమనేరు మార్కెట్‌లో టమోటా బాక్సు ధర కేవలం రూ.300నుంచి 350 పలికింది. క్రమేపి రూ.500కు చేరింది. తరువాత రూ.700 పలికింది. ఇలా రోజుల వ్యవధిలోనే రూ.1000కి చేరుకుంది. జూదాన్ని తలపిస్తూ ఉండే టమోటా ధరలు గత నాలుగురోజులుగా నిలకడగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే  మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టమోటా తోటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని కొందరు రైతులు చెబుతున్నారు. అంతేకాక ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశిస్తుండడంతో మళ్లీ వర్షాలు పడితే మాత్రం పంట దెబ్బతింటుందని రైతులు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటకు నిలకడగా ఉన్న ధరలతో పెట్టిన పెట్టుబడులతో పాటు నాలుగు డబ్బులు వెనకేసుకే అవకాశం ఉన్నట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టమోటా ధరలు పెరుగుతుండడంతో పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వందలాది మంది రెతులు 15 రోజులుగా టమోటా నారు తీసుకొచ్చి నాటుతున్నారు. కాగా అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం మెట్ట ప్రాంతాల్లో టమోటా సాగు విస్తారంగా చేపట్టారని అక్కడి నుంచి కాయలొస్తే మళ్లీ ధరలు పతనం తప్పదని వ్యాపారులు అంటున్నారు. 

Updated Date - 2022-05-19T06:35:52+05:30 IST