Tomato దిగుమతికి ఎకరా స్థలం
ABN , First Publish Date - 2021-11-30T16:28:25+05:30 IST
టమోటా లోడుతో వచ్చే వాహనాలు నిలిపేందుకు ఎకరా స్థలాన్ని కేటాయించాలని కోయంబేడు మార్కెట్ కమిటీని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. స్థానిక కోయంబేడు మార్కెట్ మైదానాన్ని తెరిచేందుకు
- కోయంబేడు మార్కెట్ కమిటీకి మద్రాసు హైకోర్టు ఆదేశం
పెరంబూర్(చెన్నై): టమోటా లోడుతో వచ్చే వాహనాలు నిలిపేందుకు ఎకరా స్థలాన్ని కేటాయించాలని కోయంబేడు మార్కెట్ కమిటీని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. స్థానిక కోయంబేడు మార్కెట్ మైదానాన్ని తెరిచేందుకు అనుమతివ్వాలని కోరుతూ తందై పెరియార్ టమోటా హోల్సేల్ వ్యాపారుల సంఘం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ విషయమై, వాహనాలు నిలిపే ప్రాంతంలో చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటుచేయడంతో మైదానం మూసివేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సురేష్కుమార్ టమోటా ధరలు పెరుగుతుండడాన్ని పరిగణలోకి తీసుకొని వాహనాలు నిలిపేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చేందుకు వీలవుతుందా అంటూ ఇటీవల సీఎండీఏ, కోయంబేడు మార్కెట్ కమిటీని ప్రశ్నించారు. ఈ పిటిషన్ మళ్లీ సోమవారం విచారణకు రాగా, 800 వాహనాలు 8 ప్రాంతాల్లో నిలిపేలా వసతులున్నాయని మార్కెట్ కమిటీ అఫిడివిట్లో పేర్కొంది. టమోటా లోడు వాహనాలు నిలిపేందుకు అవకాశం లేకపోవడమే ధరలు పెరిగాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని, గతంలో కంటే ప్రస్తుతం టమోటా ధరలు తగ్గాయని పేర్కొన్న కమిటీ, టమోటా విక్ర యాలకు సమీపంలోని ఏ రోడ్డు, ఎఫ్ బ్లాక్ సమీపంలో వాహనాలు నిలుపుకోవచ్చని తెలిపింది. అలాగే, వాహనాలు నిలిపి వేరే వాహనాలకు ఎక్కిస్తామని, ఆ ప్రాంతంలో కొనుగోళ్లు చేపట్టబోమని వ్యాపారుల సంఘం తెలియజేసింది. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్నా న్యాయమూర్తి, టమోటా వాహనాలు నిలిపేందుకు తాత్కాలికంగా ఎకరా స్థలం కేటాయిం చాలని, మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమలురావాలని పేర్కొంటూ, తదుపరి విచారణ డిసెంబరు 15వ తేదీకి వాయిదావేశారు.