తరగతి గదిలో... కొత్తమ్మాయిలు!

ABN , First Publish Date - 2021-01-31T05:45:27+05:30 IST

తెలుగు తెరకు కొత్త ముఖాలు, కొత్త అందాలు కొత్తేమీ కాదు. ఏటా పదుల సంఖ్యలో కథానాయికలు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈసారి అంతకుమించి నాయికలు తెలుగుతెరకు పరిచయం కాబోతున్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భామలు 2021లో టాలీవుడ్‌లో సందడి

తరగతి గదిలో... కొత్తమ్మాయిలు!

టాలీవుడ్‌ 2021


తెలుగు తెరకు కొత్త ముఖాలు, కొత్త అందాలు కొత్తేమీ కాదు. ఏటా పదుల సంఖ్యలో కథానాయికలు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈసారి అంతకుమించి నాయికలు తెలుగుతెరకు పరిచయం కాబోతున్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భామలు 2021లో టాలీవుడ్‌లో సందడి చేయబోతున్నారు. కొత్త అమ్మాయిల అందాలతో ఈ ఏడాది వెండితెర కళకళలాడబోతోంది. 


సంక్రాంతి బరిలో విడుదలైన రామ్‌ ‘రెడ్‌’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యారు అమృతా అయ్యర్‌. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషించి చక్కని గుర్తింపు పొందారు. మొదటి సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రెండో చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ విడుదలైంది. రెండు చిత్రాల్లోనూ కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. మరో నాయిక జ్ఞానేశ్వరి కండ్రేగుల ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ‘క్రాక్‌’ చిత్రంతో కూడా చిన్న పాత్రతో మెప్పించారామె!’’


ముగ్గురు బాలీవుడ్‌ నాయికలు...

హిందీలో గ్లామర్‌, కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అలియాభట్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగులో ఆమెకిది పరిచయ చిత్రం. ఇందులో రామ్‌చరణ్‌ సరసన నాయికగా తెరపై సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఆమె ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేశారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’, ‘పతీ పత్ని అవుర్‌ ఓ. ‘అంగ్రేజీ మిడియమ్‌’ చిత్రాల ఫేమ్‌ అనన్యా పాండే కూడా టాలీవుడ్‌లో నాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘లైగర్‌’ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మరో హిందీ కథానాయిక సయీ మంజ్రేకర్‌ కూడా తెలుగు తెరపై సందడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌ ‘గని’, అడివి శేష్‌ ‘మేజర్‌’ చిత్రాల్లో సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. అలియాభట్‌, అనన్యాపాండే, సయీ మంజ్రేకర్‌ హీరోయిన్లుగా తెలుగు డెబ్యూ చిత్రాలివి.


అందం.. అమాయకత్వం...

అందం, అభినయంతోపాటు అమాయకత్వం తోడైన కథానాయిక కృతీ శెట్టి. ‘ఉప్పెన’తో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం టీజర్‌, పాటలు చూడగానే ఆమెలోని ఈ మూడు గుణాలను గ్రహించవచ్చు. మొదటి సినిమా సెట్స్‌ మీద ఉండగానే రెండో అవకాశాన్ని కూడా అందుకున్నారు కృతీశెట్టి. నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్‌ సింగారాయ్‌’ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆమె రెండు చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. 


హాలీవుడ్‌ బ్యూటీ..

హాలీవుడ్‌ మోడల్‌ ఒలీవియా మోరిస్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా జెన్నీఫర్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నారు. ఇటీవల ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ్ఙ


వరుసగా రెండేసి చిత్రాలు..

‘ఆహా’ ప్రచార చిత్రంలో అల్లు అర్జున్‌ పక్కన కనిపించిన కేతిక శర్మ ‘రొమాంటిక్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. నాగశౌర్య కథానాయకుడిగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ చిత్రంలోనూ ఆమే కథానాయిక. ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న కథానాయిక ఫరియా అబ్దుల్లా. ఈ చిత్రమే కాకుండా అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారామె! ‘అవుట్‌ ఆఫ్‌ లవ్‌’ టీవీ సిరీస్‌తో గుర్తింపు పొంది పలు మ్యూజిక్‌ వీడియోలతో సందడి చేసిన మీనాక్షీ చౌధురి సుశాంత్‌ హీరోగా నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు  పరిచయం కానున్నారు. అలాగే రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలోనూ ఆమె నాయికగా అవకాశం అందుకున్నారు. పాప్‌ సింగర్‌గా సంచలనం సృష్టించిన డామన్‌ బ్యూటీ షెర్లీ సేథీ నాగశౌర్య - దర్శకుడు అనీశ్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నూతన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమవుతున్నారు. శివానీ రాజశేఖర్‌  కథానాయికగా గతంలో ఓ చిత్రం మొదలైనప్పటికీ ఆ చిత్రం ప్రారంభంలోనే ఆగిపోయింది. అందుకే శివానీ హీరోయిన్‌గా కొత్త జర్నీ ప్రారంభించారు. ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయమవుతున్నారు. దాదాపు ఈ ఏడాది 13 మంది కొత్త హీరోయిన్లు తెలుగుతెరకు  పరిచయమవుతున్నారు. ’


కన్ను గీటి.. అవకాశం కొట్టి...

‘ఒరు అదార్‌ లవ్‌’ అనువాద చిత్రం ‘లవర్స్‌ డే’ చిత్రంతో యువత ఆకట్టుకున్నారు మల్లూ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అది అనువాద చిత్రమైనప్పటికీ అందులో కన్ను గీటిన సన్నివేశంలో లక్షలాది మంది అభిమానులింన సంపాదించుకున్నారు ప్రియా ప్రకాశ్‌. ఇటీవల తెలుగులో ‘లడీ లడీ’ అంటూ ఓ ప్రత్యేక గీతంతో సందడి చేశారు. అయితే త్వరలో ఆమె తెలుగుతెరపై డెబ్యూ హీరోయిన్‌గా కనిపించనున్నారు. నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘చెక్‌’ చిత్రంలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకిది తొలి సినిమా. 

Updated Date - 2021-01-31T05:45:27+05:30 IST