‘సంక్షేమం’పై అలక్ష్యాన్ని సహించం
ABN , First Publish Date - 2021-10-19T06:14:17+05:30 IST
అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు అలక్ష్యం చూపితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే యు.వి.రమణ మూర్తిరాజు హెచ్చరించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి..
మండల సమావేశంలో ఎమ్మెల్యే రమణమూర్తిరాజు
ఎలమంచిలి, అక్టోబరు 18: అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు అలక్ష్యం చూపితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే యు.వి.రమణ మూర్తిరాజు హెచ్చరించారు. సోమవారం ఇక్కడి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బోదెపు గోవింద్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకోకపోతే, సదరు స్థలాన్ని వేరొకరి మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభింపజేయాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్థక, జల వనరులు, విద్యుత్, ఐసీడీ ఎస్ శాఖలకు చెందిన అభివృద్ధి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ బోదెపు గోవింద్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్య సాధనకు సమష్టి కృషితో ముందుకు సాగాలన్నారు. జడ్పీటీసీ శానాపతి సంధ్యారాణి, వైస్ ఎంపీపీ రాజాన శేషు, ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్లు గాంధీ, మహాలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.