భారత్కు శరాఘాతమే!
ABN , First Publish Date - 2020-04-09T09:57:58+05:30 IST
టోక్యో విశ్వ క్రీడలు ఏడాది వాయిదా పడ్డాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో క్రీడా సమాఖ్య తమ క్రీడాంశాల ఒలింపిక్ అర్హత సమయాన్ని పొడిగిస్తూ ...
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్ణయం
న్యూఢిల్లీ: టోక్యో విశ్వ క్రీడలు ఏడాది వాయిదా పడ్డాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో క్రీడా సమాఖ్య తమ క్రీడాంశాల ఒలింపిక్ అర్హత సమయాన్ని పొడిగిస్తూ వస్తున్నాయి. తాజాగా..వరల్డ్ అథ్లెటిక్స్ కూడా ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ సమయాన్ని వచ్చే నవంబరు వరకు సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం..టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాలని భావిస్తున్న మన అథ్లెట్లకు శరాఘాతమే. వాస్తవంగా.. దేశవాళీ టోర్నమెంట్ల ద్వారా ఒలింపిక్ మార్క్ను అందుకొని టోక్యో బెర్త్ దక్కించుకోవాలని పలువురు ట్రాక్, ఫీల్డ్ అథ్లెట్లు పట్టుదలగా ఉన్నారు. కానీ కరోనా దెబ్బకు దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడంతో ఎలాంటి క్రీడా పోటీలకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఒలింపిక్ అర్హత సమయాన్ని ఈనెల ఆరునుంచి వచ్చే నవంబరు 30 వరకు అంటే..ఏడు నెలలకుపైగా వరల్డ్ అథ్లెటిక్స్ సస్పెండ్ చేసింది. ఈ ఏడు నెలలలో జరిగే ఏ టోర్నీలోనైనా అథ్లెట్లు సాధించిన ఫలితాలను టోక్యో ఒలింపిక్స్కు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం దేశంలోని పలువురు అథ్లెట్లకు చేటు చేస్తుందని నేషనల్ డిప్యూటీ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ ఆందోళన వ్యక్తంచేశాడు. ‘వరల్డ్ అథ్లెటిక్స్ నిర్ణయం తేజిందర్ పాల్ తూర్ (షాట్పుట్), అన్నూరాణి (జావెలిన్ త్రో), శ్రీశంకర్ (లాంగ్జంప్), స్టార్ స్ర్పింటర్ ద్యూతీచంద్కు నష్టం చేస్తుంది’ అని అతడు అన్నాడు.
మరో స్టార్ స్ర్పింటర్ హిమాదాస్ కూడా ఒలింపిక్స్కు అర్హత సాధించకపోవడం గమనార్హం. అయితే జావెలిన్ త్రోయర్లు నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్, 4్ఠ400 మీ., మిక్స్డ్ రిలే జట్టు, ఇర్ఫాన్ (20 కి.మీ., రేస్వాక్), భావన జాట్ (20 కి.మీ., రేస్వాక్), అవినాష్ (3వేల మీ., స్టీపుల్చేజ్) మాత్రం టోక్యో బెర్త్లు ఖరారు చేసుకున్నారు. 2019 నుంచి ప్రారంభమైన అర్హత సమయంలో ఒలింపిక్ మార్క్ను అందుకున్న క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని వరల్డ్ అథ్లెటిక్స్ పేర్కొంది. కొవిడ్-19 వైరస్ ఎప్పటికి తగ్గుముఖం పడుతుందో ఏ దేశానికీ కచ్చితమైన అంచనాలు లేవని, అందువల్లే క్వాలిఫికేషన్ సమయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్రీజ్ చేసి ఉంటుందని నాయర్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో క్వాలిఫికేషన్ కోసం అథ్లెట్లకు రెండేళ్ల సమయాన్ని కేటాయించడం కూడా సబబు కాదని వ్యాఖ్యానించాడు. సెప్టెంబరు, అక్టోబరులో నేషనల్ ఇంటర్ స్టేట్, నేషనల్ ఓపెన్ చాంపియన్షి్పను నిర్వహించాలని అథ్లెటిక్స్ సమాఖ్య యోచిస్తోందని రాధాకృష్ణన్ చెప్పాడు. అయితే ఆ టోర్నీల ఫలితాలను ఒలింపిక్స్ అర్హతకు పరిగణనలోకి తీసుకోకపోవడంతో అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే అవకాశాలు లేవన్నాడు.