టోకెనైజేషన్ గడువు పెంపు
ABN , First Publish Date - 2022-06-25T09:25:36+05:30 IST
కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్) టోకెనైజేషన్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్) టోకెనైజేషన్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. గతంలో ప్రకటించిన గడువు ఈ నెల 30వ తేదీన ముగిసిపోనుండగా దాన్ని సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఈ-కామర్స్ కంపెనీలు.. కస్టమర్ కార్డు సమాచారాన్ని తమ వెబ్సైట్లలో నిక్షిప్తం చేయడాన్ని ఇది నిరోధిస్తుంది. కొత్తగా ప్రవేశపెడుతున్న టోకెనైజేషన్ ప్రక్రియలో కస్టమర్ కార్డు వివరాలను ‘టోకెన్’ పేరిట ప్రత్యేక ప్రత్యామ్నాయ కోడ్ను ఇస్తారు. దీనివల్ల లావాదేవీలు మరింత సురక్షితం అవుతాయి. సైబర్ నేరగాళ్లు సంబంధిత వెబ్సైట్ను హ్యాక్ చేసినా కస్టమర్ సమాచారం చౌర్యం అయ్యే అవకాశం ఉండదు.
ఇదిలా ఉండగా అధిక శాతం మంది పెద్ద వర్తకులు సీఓఎఫ్ టోకెనైజేషన్ నిబంధనలు అమలుపరుస్తున్నారని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికే కొందరు పెద్ద వ్యాపారులు ఈ నిబంధన అమలుపరుస్తుండగా మరి కొందరు దాన్ని అమలుపరిచే సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. తాము ఇప్పటికే 19.5 కోట్ల టోకెన్లు జారీ చేసినట్టు ఆర్బీఐ తెలిపింది.