ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగికి టోకరా
ABN , First Publish Date - 2021-04-16T07:24:45+05:30 IST
మండలంలోని మస్కాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ సుర్జాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు కేటుగాళ్ళు టోకరా వేసినట్లు బాధితుడు ఆరోపించారు.
ఖానాపూర్, ఏప్రిల్ 15 : మండలంలోని మస్కాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ సుర్జాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు కేటుగాళ్ళు టోకరా వేసినట్లు బాధితుడు ఆరోపించారు. గురువారం బాధితుడు షేక్ షారుఖ్ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ తనకు సుర్జాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గురుకుల పాఠశాలలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందుకోసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని నమ్మించారన్నారు. అది నమ్మిన తాను వారికి రూ.3లక్షలు ఇచ్చానని అప్పటి నుండి ఇప్పటి వరకు తనకు ఎటువంటి ఉద్యోగం ఇప్పించలేదని తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఖానాపూర్ ఎస్ఐ రామునాయక్ను వివరణకోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. వ్రాతపూర్వకంగా పిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేపడుతామని ఎస్ఐ తెలిపారు.