నేటి అలంకరణ శ్రీ మహిషాసురమర్దిని
ABN , First Publish Date - 2021-10-14T05:30:00+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిదో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు.
14- 10- 2021
ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి)
శరన్నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిదో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శ్రీ మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, బిడాలుడు వంటి రాక్షసులందర్నీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుణ్ణి వధించి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువైంది. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ దేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందంటారు. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయని, సకల దోషాలు నివృత్తి అవుతాయనీ, శత్రువులపైనా, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం.
నైవేద్యం: బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు
అలంకరించే చీర రంగు: గోదుమ, ఎరుపు
అర్చించే పూలు: తామర పుష్పాలు
పారాయణ: చెయ్యాల్సింది: శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం