కశ్మీర్ యువత అభివృద్ధి కోరుతోంది: అమిత్షా
ABN , First Publish Date - 2021-10-24T00:57:24+05:30 IST
కశ్మీర్ యువత అభివృద్ధిని కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. మూడు రోజల పర్యటనలో భాగంగా ..
శ్రీనగర్: కశ్మీర్ యువత ఇవాళ అభివృద్ధిని కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. మూడు రోజల పర్యటనలో భాగంగా శ్రీనగర్లో శనివారం జరిగిన జే&కే యూత్ క్లబ్ సభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి అమిత్షా మాట్లాడుతూ, 2019 ఆగస్టు 5వ తేదీని స్వర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుందని అన్నారు. టెర్రరిజం, ఆశ్రితపక్షపాతం, అవినీతికి ఆరోజు చరమగీతం పాడామని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంత అభివృద్ధికి జమ్మూకశ్మీర్ యువత కంకణబద్ధులు కావాలని, ఇది వారి బాధ్యత అని అమిత్షా సూచించారు.
రెండున్నరేళ్ల తర్వాత తాను జమ్మూకశ్మీర్ వచ్చానని, భద్రతా సమీక్షా సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషం కలిగించిందని అమిత్షా చెప్పారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందని, రాళ్లు రువ్వుడు ఘటనలు కనుమరుగయ్యాయని చెప్పారు. ఇక్కడి ప్రశాంత పరిస్థితిని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనే స్పష్టమైన హామీ తాను ఇస్తున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఏ ఒక్కరూ ఆపలేరని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇండియాలోని కశ్మీర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చలేమని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనను (డీలిమిటేషన్) ఎందుకు ఆపాలని ఆయన ప్రశ్నించారు. డీలిమిటేషన్ జరుగుతూనే ఉంటుందని చెప్పారు. అనంతరం ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఉంటుందని అన్నారు. కశ్మీర్ యువతతో మైత్రీసంబంధాలను తాను కోరుకుంటున్నట్టు అమిత్షా పేర్కొన్నారు.