నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-10-19T08:26:07+05:30 IST

లక్ష్మీనృసింహుడి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

  • ఉద్ఘాటన తేదీలు ప్రకటించే చాన్స్‌.. 
  • పనులపై అధికారులతో సమీక్ష
  • గడువులోగా పూర్తి చేసేలా దిశానిర్దేశం

యాదాద్రి/హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): లక్ష్మీనృసింహుడి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనపై ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్‌ విడుదల కానప్పటికీ... ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌ నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఈ మేరకు టెంపుల్‌ సిటీ సమీపంలోని హెలీప్యాడ్‌ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆలయంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. నవంబరు లేదా డిసెంబరులో యాదాద్రి ఆలయ ఉద్ఘాటన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఇందులో భాగంగానే ఇటీవల ముచ్చింతలలో చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం.. ఆలయ ఉద్ఘాటనపై చర్చించి ముహుర్తాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ వెంటనే గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైటీడీఏ అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం యాదాద్రిలో పనుల పురోగతిని కేసీఆర్‌ పరిశీలించనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు చినజీయర్‌ స్వామి నిర్ణయించిన తేదీలను, మహా సుదర్శన యాగం తేదీలను స్వయంగా సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రకటించనున్నారు.

Updated Date - 2021-10-19T08:26:07+05:30 IST