గెలుపు ఎవరిదో..?
ABN , First Publish Date - 2021-01-27T06:20:30+05:30 IST
కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ) డైరెక్టర్ల ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి.
- నేడు విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక
నంద్యాల, జనవరి 26: కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ) డైరెక్టర్ల ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి ఆళ్ళగడ్డకు చెందిన ఎస్వీ జగన్మోహన్రెడ్డి, గంగుల కుటుంబీకుడైన గంగుల విజయసింహారెడ్డి రేసులో ఉన్నారు. అయితే ఎస్వీ జగన్మోహన్రెడ్డికి డైరెక్టర్గా పోటీకి అర్హత లేదంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు. డైరెక్టర్గా పోటీ చేస్తున్న మల్లికార్జున పిటీషన్తో ఎన్నికలపై ఈనెల 20వ తేదీన స్టే వచ్చింది. అయితే ఆయన తన పిటీషన్ను ఉపసంహరించుకోవడంతో ఈనెల 24వ తేదీన హైకోర్టు స్టే ఎత్తి వేసిం ది. దీంతో 27వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. విజయ డెయిరీ మూడు డైరెక్టర్ల పోస్టులకు ఆరుగురు పోటీలో ఉన్నారు. 81 మంది పాల సంఘాల అధ్యక్షులు ఓటు వేస్తారు. ఒక్కొక్కరు 3 ఓట్లు వేస్తారు. గత ఏడాది ఎన్నికలు జరగని కారణంగా ఇప్పటి వరకు ఉన్న 9 మంది డైరెక్టర్లతో పాటు కొత్తగా ఎన్నికయ్యే ముగ్గురు డైరెక్టర్లతో 12 మంది కలిసి చైర్మన్ను ఎన్నుకుంటారు. భూమా నారాయణరెడ్డికి చైర్మన్ పదవి దక్కే లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి పావులు కదుపుతున్నారు.