నేడు తమిళ ఉగాది

ABN , First Publish Date - 2022-04-14T13:44:36+05:30 IST

రాష్ట్రంలో ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతో జీవించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. గురువారం జరుగనున్న తమిళ ఉగాది పండుగను పురస్కరించుకుని నాయకులు,

నేడు తమిళ ఉగాది

-  ప్రజలు శాంతి, సౌఖ్యాలతో జీవించాలి

- గవర్నర్‌, సీఎం సహా నేతల శుభాకాంక్షలు


చెన్నై: రాష్ట్రంలో ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతో జీవించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. గురువారం జరుగనున్న తమిళ ఉగాది పండుగను పురస్కరించుకుని నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి విడుదల చేసిన సందేశంలో.. ‘‘తమిళ సంస్కృతీ సంప్రదాయాలను ఎలుగెత్తి చాటే తమిళ మాసం చిత్తిరై తొలి రోజును ఉగాదిగా జరుపుకుంటున్న ప్రపంచంలోని తమిళులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ శాంతి, సౌభాగ్యాలు కలిగించాలని వేడుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ‘‘ఆదిమానవుడు తమిళుడని, అతడి భాష తేనెలొలుకు తమిళమేనని ప్రముఖ కవి భారతిదాసన్‌ పేర్కొన్నట్టుగా తమిళులంతా ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. తమిళ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో శాంతి, ప్రేమ నింపుతూ ఈ కొత్త ఉగాది తమిళ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ఇదే విధంగా అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్‌, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, కాంగ్రెస్‌ ఎంపీ తిరునావుక్కరసర్‌, సమత్తువ మక్కల్‌ కట్చి నాయకుడు శరత్‌కుమార్‌, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, పుదియ నీతి పార్టీ వ్యవస్థాపకులు ఏసీ షణ్ముగం, తదితర నాయకులు కూడా తమిళ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వేర్వేరు ప్రకటనలు చేశారు. అలాగే, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని మేల్‌మరువత్తూర్‌ ఆదిపరాశక్తి పీఠాధిపతి బంగారు అడిగళార్‌ తమిళ సంవత్సరాది శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు.



Updated Date - 2022-04-14T13:44:36+05:30 IST