రారండోయ్ వేడుక చూద్దాం...
ABN , First Publish Date - 2022-04-16T12:54:30+05:30 IST
స్థానిక ఐల్యాండ్ గ్రౌండ్స్లో శనివారం శ్రీనివాస కల్యాణం జరుగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కల్యాణోత్సవానికి మైదానాన్ని సిద్ధం చేయడంతో పాటు కల్యాణ
- నేడు నగరంలో శ్రీనివాస కల్యాణం
- భారీగా ఏర్పాట్లు
- భక్తులందరికీ ప్రసాద వితరణ
- సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్
చెన్నై: స్థానిక ఐల్యాండ్ గ్రౌండ్స్లో శనివారం శ్రీనివాస కల్యాణం జరుగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కల్యాణోత్సవానికి మైదానాన్ని సిద్ధం చేయడంతో పాటు కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఏర్పాట్ల గురించి టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ శుక్రవారం మీడియాకు వివరించారు. సాయంత్రం 5 గంటల నుంచి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రారంభం కానుందని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 12 ఏళ్ల తరువాత మళ్లీ చెన్నైలో జరిగే ఈ వేడుకకు ముఖ్యమంత్రిని, గవర్నర్ను ఆహ్వానించామన్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి వచ్చే వీఐపీలు, ముఖ్యులు, సాధారణ భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులు మైదానంలోకి వచ్చేటప్పుడు స్వామివారి లడ్డూ ప్రసాదం, పండు, నీటి బాటిల్ అందించనున్నామన్నారు. శ్రీవారి కల్యాణం కోసం వేదికను దశావతారాలతో రూపొందించామన్నారు. వేదిక నుంచి చివరి గ్యాలరీ వరకు స్వామివారిని ఊరేగిస్తామని, ఈ సందర్భంగా భక్తులందరూ స్వామివారిని దగ్గరి నుంచే దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుమల నుంచి వచ్చే వేద పండితుల నేతృత్వంలో ఈ కల్యాణం జరుగనుందన్నారు. ప్రతి గ్యాలరీ వద్ద ఒక ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పర్యవేక్షణ వుంటుందని, అలాగే ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సత్వర చికిత్స అందించేలా అంబులెన్సులను కూడా సిద్ధం చేశామని శేఖర్ వివరించారు. ఈ కల్యాణోత్సవానికి ప్రవేశం ఉచితమని, స్వామివారి కల్యాణం వీక్షించే సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సలహా మండలి ఉపాధ్యక్షుడు వెంకటసుబ్రమణ్యం, సభ్యులు ఆనందకుమార్రెడ్డి, మోహన్రావు, కృష్ణారెడ్డి, కార్తికేయన్, యువరాజ్, ఇందిర తదితరులు కూడా పాల్గొన్నారు.