బోణీపై ధవన్ సేన గురి
ABN , First Publish Date - 2021-07-25T08:56:50+05:30 IST
శ్రీలంకపై వన్డే సిరీస్ నెగ్గి జోరుమీదున్న టీమిండియా పొట్టి ఫార్మాట్పై కన్నేసింది. మూడు టీ20ల సిరీ్సలోనూ బోణీ చేయాలని ధవన్ సేన ఉవ్విళ్లూరుతోంది.
నేడు భారత్-శ్రీలంక తొలి టీ20
రా.8 నుంచి సోనీ నెట్వర్క్లో
కొలంబో: శ్రీలంకపై వన్డే సిరీస్ నెగ్గి జోరుమీదున్న టీమిండియా పొట్టి ఫార్మాట్పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్ లోనూ బోణీ చేయాలని ధవన్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్లో నెగ్గి సిరీ్సలో బోణీ చేయాలని యువ భారత్ భావిస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ యజ్వేంద్ర చాహల్తో బంతి పంచుకోనున్నాడు.
బ్యాటింగ్లో మనీష్ పాండేతో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది. ఓపెనర్లు పృథ్వీషా, ధవన్తో పాటు సూర్యకుమార్ ఫామ్లో ఉండడం సానుకూలాంశం. పాండ్యా బ్రదర్స్తో ఆల్రౌండర్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. అయితే క్రునాల్కు కృష్ణప్ప గౌతమ్ గట్టిపోటీ ఇస్తున్నాడు. మరోవైపు వన్డే సిరీస్ ఓడిన ఆతిథ్య లంక టీ20ల్లో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. ఆఖరి, మూడో వన్డేలో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో లంకేయులు బరిలోకి దిగనున్నారు. చివరి వన్డేలో రాణించిన ఓపెనర్ అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, చమిక కరుణరత్నెపై భారీ అంచనాలున్నాయి.