నేడే అన్బుమణికి పట్టాభిషేకం

ABN , First Publish Date - 2022-05-28T13:09:54+05:30 IST

పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్ కు పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. శనివారం

నేడే అన్బుమణికి పట్టాభిషేకం

- తిరువేర్కాడులో పీఎంకే సర్వసభ్య సమావేశం

- ఐదుగురికి అవార్డుల ప్రదానం


చెన్నై: పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్ కు పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. శనివారం జరుగనున్న పీఎంకే ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలోనే పార్టీకి  విశిష్ట సేవలందించిన ఐదుగురికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి మూడు దశాబ్దాలకు పైగా ఆ పదవిలో కొనసాగటంతో పార్టీకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ అధినేత డాక్టర్‌ రాందాస్‌ నిర్ణయించారు. అధ్యక్ష పదవి నుండి తప్పుకోనున్న జీకే మణికి ఇటీవల పార్టీ నేతల సమక్షంలో ఘనసత్కారం కూడా జరిగింది. ఈ సత్కార సభ జీకే మణికి వీడ్కోలు పలికే విధంగా కొనసాగింది. పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలందించారంటూ రాందాస్‌ సహా పార్టీ సీనియర్‌ నేతలు కొనియాడారు. ఈ పరిస్థితుల్లో జీకే మణి శాసనసభలో పార్టీ సభాపక్ష నాయకుడిగా కొనసాగనున్నారు. అదే సమయంలో పార్టీకి ఆయన అందించిన సుదీర్ఘ సేవలను పరిగణనలోకి తీసుకుని సర్వసభ్య మండలి సమావేశంలో కొత్తపదవిని రూపొందించి అందులో ఆయనను నియమించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించే దిశగా పార్టీ నాయకత్వాన్ని యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణికి అప్పగించనున్నారు. పార్టీ అభివృద్ధి కోసం అన్బుమణి హైటెక్‌ విధానాన్ని అనుసరిస్తున్నారని, రాష్ట్ర రాజకీయాలతోపాటు, జాతీయ రాజకీయాలపై కూడా చక్కటి అవగాహన కలిగి ఉన్నారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించనున్నారని పార్టీ సీనియర్‌ నేతలు తెలిపారు. తిరువేర్కాడు సమీపంలో జీపీఎన్‌ ప్యాలెస్‌ మహల్‌లో శనివారం జరుగనున్న పీఎంకే ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశానికి మండలి సభ్యులే కాకుండా పుదుచ్చేరికి చెందిన పార్టీ నిర్వాహకులు, సభ్యులు కూడా హాజరుకావాలని జీకే మణి శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు.

Updated Date - 2022-05-28T13:09:54+05:30 IST