40ఏళ్ల తర్వాత తోబుట్టువుల చెంతకు
ABN , First Publish Date - 2021-07-31T07:03:17+05:30 IST
11ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయిన బాలుడు 40ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబసభ్యుల చెంతకు చేరాడు.
ఎస్పీ సమక్షంలో అప్పగింత
ఆనందం వ్యక్తంచేసిన చెల్లెళ్లు
నల్లగొండ, జూలై 30 : 11ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయిన బాలుడు 40ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబసభ్యుల చెంతకు చేరాడు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చాకలి బజార్కు చెందిన నల్లగంతుల రాములు కుమారుడు పుల్లయ్య ఆరో తరగతి చదివే రోజుల్లో తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పలు ప్రాంతాల్లో భిక్షాటనతో కాలం గడిపిన అతడు చివరకు ఖమ్మం చేరుకున్నాడు. అతడిని మూడు నెలల క్రితం అన్నంసేవ ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస్ చేరదీసి ఆశ్రయం కల్పించాడు. పుల్లయ్య నుంచి వివరాలు సేకరించి నల్లగొండ ఎస్పీ రంగనాథ్ సమక్షంలో తోబుట్టువులకు శుక్రవారం అప్పగించారు. అనేక సంవత్సరాల తర్వాత తమ సోదరుడు తిరిగి రావడంపై తోబుట్టువులు రేణుక, దుర్గ హర్షం వ్యక్తంచేశారు.