మీరాబాయి చానూకు బంపర్ ఆఫర్.. ఇక జీవితమంతా..
ABN , First Publish Date - 2021-07-25T19:29:15+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించి దేశ కీర్తిప్రతిష్ఠలను శిఖరాగ్రానికి చేర్చిన మీరాబాయ్ చానుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించి దేశ కీర్తిప్రతిష్ఠలను శిఖరాగ్రానికి చేర్చిన మీరాబాయ్ చానుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రముఖ ఫాస్ట్ఫుడ్ చైన్ డోమినోస్ మీరాబాయ్కు ఓ అద్భుత ఆఫర్ను ప్రకటించింది. మీరాబాయి అభిరుచికి తగ్గట్టుగా ఇకపై ఆమెకు జీవితమంతా ఉచితంగా పిజ్జా ఇస్తామని పేర్కొంది.
‘‘భారత్కు ఒలింపిక్ పతకాన్ని అందించిన మీరాబాయికి శుభాకాంక్షలు. భారతీయుల కలలను మీరు నిజం చేశారు. అందుకే..ఇక మీకు జీవితకాలమంతా ఉచితంగా పిజ్జా ఇస్తాం. ఇంతకుమించిన సంతోషకరమైన విషయం మాకు ఇంకొకటి లేదు’’ అంటూ డోమినోస్ పిజ్జా ట్వీట్ చేసింది. తనకు పిజ్జా చాలా ఇష్టమంటూ మీరాబాయి ప్రకటించిన వెంటనే డోమినోస్ ఈ ఆఫర్ ఇచ్చింది.
వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 21 ఏళ్లుగా పతకం కోసం ఎదురుచూసిన భారత్కు మీరాబాయి టోక్యో విశ్వక్రీడల్లో ఏకంగా రజత పతకాన్నే అందించింది. పతకం గెలుచుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒలింపిక్స్ తరువాత తాను మొదట చేయబోయే పని పిజ్జా తినడమేనంటూ పిజ్జాపై తన మక్కువను తెలియజేసారు. ఈ నేపథ్యంలో డోమినోస్ పిజ్జా ఇండియా శాఖ ఈ జీవితకాల ఆఫర్ను ప్రకటించింది.