నాకు 16.. కాదు అన్నీ నాకే!

ABN , First Publish Date - 2021-02-25T05:51:56+05:30 IST

నాకు 16 వార్డులు ఇవ్వాల్సిందేనని ఒకరు..!

నాకు 16.. కాదు అన్నీ నాకే!

ఎస్వీ మోహన్‌రెడ్డి వర్సెస్‌ హఫీజ్‌ఖాన్‌

హైదరాబాద్‌లో సర్దుబాటుకు యత్నం

ససేమిరా అన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే


కర్నూలు: నాకు 16 వార్డులు ఇవ్వాల్సిందేనని ఒకరు..! ఊహు.. నాకే అన్నీ ఇవ్వాలని మరొకరు! వైసీపీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీట్ల గొడవ ఇది. కార్పొరేషన్‌ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీలోని నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కర్నూలు నియోజకవర్గ పరిధిలో 33 వార్డులు ఉండగా.. అభ్యర్థిత్వాలు తమవారికి ఇప్పించేందుకు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి పంచాయితీ అధినాయకత్వం వద్దకు చేరింది. మంగళవారం హఫీజ్‌ఖాన్‌, ఎస్వీ మోహన్‌రెడ్డిని పిలిపించి సర్దుబాటు చేసేందుకు యత్నించారు. కానీ ఇద్దరూ ఒక తాటిపైకి రాలేక పోయారు.


33 వార్డుల్లోనూ తన అభ్యర్థులనే బరిలో ఉంచుతానని హఫీజ్‌ ఖాన్‌ అధినాయకత్వం వద్ద వాదించినట్లు సమాచారం. దీనికి ఎస్వీ మెహన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ తన వారికి 16 వార్డులను కేటాయించాలని పట్టుబట్టారు. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్‌ వేశారని, వారందరినీ గెలిపించుకునే బాధ్యత తనదని వాదించినట్లు తెలిసింది. ఇందుకు హఫీజ్‌ ఖాన్‌ స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ తన అభ్యర్థులకు బీ పారాలు ఇచ్చి గెలిపించుకుంటానని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో గురువారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-02-25T05:51:56+05:30 IST